|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 09:12 PM
'కరీంనగర్ కపుల్' బూతు బాగోతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అడ్డదారులు తొక్కిన దంపతులు హానీ ట్రాప్తో పలువుర్ని మోసం చేశారు. వ్యాపారంలో నష్టపోయామనే సాకుతో అమాయకులను వల వేసి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ఈ కేసులో భార్యాభర్తలను కరీంనగర్ రూరల్ పోలీసులు శనివారం తిరిగి జైలుకు తరలించారు. కాగా, రెండు రోజుల పోలీస్ కస్టడీలో నిందితులు వెల్లడించిన నిజాలు విస్తుగొలుపుతున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్కు చెందిన నిందితుడు గతంలో మార్బుల్, ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసేవాడు. అయితే ఆ వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ కష్టాల నుంచి సులభంగా బయటపడేందుకు 'ఈజీ మనీ' మార్గాలను యూట్యూబ్లో వెతికాడు. 'హనీ ట్రాప్' ద్వారా ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేయవచ్చని తెలుసుకున్న అతను, ఆ విషయాన్ని తన భార్యకు వివరించాడు. భర్త చెప్పిన నేరపూరిత ఆలోచనకు ఆమె కూడా సహకరించడంతో ఈ వలపు వల వ్యవహారం మొదలైంది.
ముందుగా సోషల్ మీడియా ద్వారా సంపన్న వ్యాపారులు, యువకులను ఆకర్షించేలా భార్య ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేవారు. అలా పరిచయమైన వారిని తమ అపార్ట్మెంట్కు ఆహ్వానించేవారు. అయితే.. ముందస్తు ప్లాన్ ప్రకారం భర్తే స్వయంగా తన బెడ్రూమ్లో రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బాధితులతో భార్య సన్నిహితంగా ఉన్న సమయాలను రికార్డ్ చేసేవాడు. సుమారు 50 మందికి పైగా వీరి వలలో చిక్కినట్లు సమాచారం. నిందితులు ఎంతలా తెగించారంటే.. తాము నివసిస్తున్న రూ.45 లక్షల ఫ్లాట్ వాయిదాలను కూడా బాధితుల ద్వారానే కట్టించుకున్నారు. మరికొంత మంది నుంచి నగదు, ఏసీలు, ల్యాప్టాప్లు వసూలు చేశారు.
డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన వారికి తమ వద్ద ఉన్న వీడియోలను చూపించి భయపెట్టేవారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని లేదా సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారు. పరువు పోతుందనే భయంతో చాలామంది బాధితులు రూ. వేల నుంచి లక్షల వరకు నిందితులకు చెల్లించారు. కస్టడీ విచారణలో పోలీసులు నిందితుల నుంచి సీసీ కెమెరాలు, రూ. లక్ష నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, ఏసీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు బాధితులు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Latest News