|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:48 PM
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ క్రికెట్ నిర్వాహకుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా (84) కన్నుమూశారు. 1993 నుంచి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) అధ్యక్షుడిగా 1978 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం సేవలందించారు. భారత క్రికెట్కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో మొహాలీలోని పీసీఏ స్టేడియానికి ఆయన పేరు మీదుగా ఐఎస్ బింద్రా స్టేడియంగా నామకరణం చేశారు. అంతేకాకుండా, గతంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రధాన సలహాదారుగా కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.1987 క్రికెట్ ప్రపంచకప్ను భారత్లో నిర్వహించడంలో ఐఎస్ బింద్రా ప్రముఖ పాత్ర పోషించారు. 1975, 1979, 1983 ఎడిషన్ల తర్వాత ప్రపంచకప్ను ఇంగ్లాండ్ వెలుపల నిర్వహించిన తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం. అలాగే క్రికెట్ ప్రసార రంగంలో దూరదర్శన్కు ఉన్న గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా 1994లో సుప్రీంకోర్టును ఆశ్రయించి చారిత్రాత్మక పోరాటం చేశారు. ఈ కేసులో వచ్చిన అనుకూల తీర్పు ఫలితంగా ఈఎస్పీఎన్, టీడబ్ల్యూఐ వంటి అంతర్జాతీయ ప్రసార సంస్థలు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. క్రికెట్ సౌత్ ఆఫ్రికా సీఈఓగా హరూన్ లోర్గాట్ నియామకంలోనూ బింద్రా కీలక పాత్ర పోషించారు. క్రికెట్ పరిపాలన నుంచి ఆయన 2014లో పదవీ విరమణ పొందారు.ఐఎస్ బింద్రా మృతికి ఐసీసీ ఛైర్మన్ జై షా సంతాపం తెలిపారు.
Latest News