|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 01:10 PM
2025 మే నెలలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ ఒక చారిత్రక మలుపు అని స్విట్జర్లాండ్కు చెందిన 'సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పెర్స్పెక్టివ్ స్టడీస్' (సీహెచ్పీఎం) తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ యుద్ధంలో భారత వైమానిక దళం ధాటికి పాకిస్థాన్ విలవిలలాడిందని, చివరకు తట్టుకోలేక కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ 88 గంటల పాటు సాగింది. ఈ స్వల్ప కాలంలోనే భారత యుద్ధ విమానాలు పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలతో పాటు, ఆ దేశ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. స్విస్ నివేదిక ప్రకారం.. భారత్ అనుసరించిన 'ఎస్కలేషన్ డామినెన్స్' (యుద్ధాన్ని తన అదుపులో ఉంచుకునే వ్యూహం) ముందు పాకిస్థాన్ నిలవలేకపోయింది. మే 10వ తేదీ ఉదయానికల్లా పాక్ సైన్యం తన పరాజయాన్ని అంగీకరిస్తూ యుద్ధాన్ని ఆపేయాలని కోరినట్లు నివేదిక వెల్లడించింది.భారత రక్షణ వ్యవస్థలో భాగమైన ఎస్-400 క్షిపణులు పాక్ డ్రోన్లు, విమానాలను సమర్థవంతంగా అడ్డుకున్నాయని ఈ అధ్యయనం ప్రశంసించింది. మరోవైపు, భారత గగనతలం నుంచే ప్రయోగించిన బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులు పాక్ భూభాగంలోని 200 కిలోమీటర్ల లోపల ఉన్న లక్ష్యాలను ఛేదించాయి. దీనివల్ల పాక్ తన రాడార్లు, కమాండ్ సెంటర్లను కోల్పోయి 'గుడ్డిది'గా మారిందని, యుద్ధం కొనసాగించే శక్తి లేకనే సంధికి ఒప్పుకుందని విశ్లేషించింది.
Latest News