|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:08 PM
కుటుంబ విభేదాల కారణంగా కోడలిపై ప్రతీకారంతో మామ పిటిషన్ వేయగా.. ఉన్నత న్యాయస్థానం అతడికి షాకిచ్చింది. కొడుకు కోడలు మధ్య మనస్పర్దలు వస్తే పెద్దలుగా వారికి సర్దిచెప్పాల్సింది పోయి, సమస్యను ఇంకా జఠిలం చేయకూడదని హితవు చెప్పింది. అనంతరం ఇలాంటి పిటిషన్ వేసిన ఆయనకు రూ.2000 జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మరైమలైనగర్కి చెందిన బాలసుబ్రహ్మణ్యం.. మోనికా అనే వైద్యురాలిపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసిందని, ప్రభుత్వ కోటా కింద చదువుకుని, నిబంధల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో కచ్చితంగా పనిచేయాల్సి ఉంది, కానీ ఆమె ఆలా చేయలేదని తెలిపారు. కాబట్టి ఆమె చదువుకు అయిన రూ.40 లక్షలు తిరిగి చెల్లించాలని గతేడాది జూన్లో ప్రభుత్వం లేఖ పంపిందని చెప్పారు.
కానీ, ఆ మొత్తం చెల్లించలేదని, వెంటనే వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అతడు కోరారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ భరత చక్రవర్తి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున హాజరైన లాయర్.. డాక్టర్ మోనికాపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయితే, మోనికాకు వ్యతిరేకంగా కేసు వేయడానికి పిటిషనర్కు ఎలాంటి అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక, తనపై పిటిషన్ వేసిన వ్యక్తి తన భర్త తండ్రేనని, కుటుంబ సమస్యలతో ఆ సంబంధాన్ని దాచిపెట్టి కేసు దాఖలు చేశారని ఆమె తరఫున లాయర్ తెలియజేశారు.
తన భర్తతో విడాకుల పిటిషన్ పెండింగ్లో ఉందని, ఇంతకు ముందు తన గురించి రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారని వివరించారు. ఆ ఫిర్యాదును కౌన్సిల్ కొట్టివేయడంతో ఇప్పుడు ఈ కేసు వేశారని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ భరత చక్రవర్తి.. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడితే పెద్దలు కల్పించుకుని పరిష్కరించాలని, అలాకాకుండా సమస్యను ఇంకా పెద్దది చేయరాదని హితవు పలికారు. కోడలిపై ప్రతీకారంతో తీర్చుకోవాలనే దురుద్దేశంతో ఈ పిటిషన్ వేసినందుకు రూ.2 వేల జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్కి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Latest News