|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:09 PM
కర్ణాటకలోని బెళగావి సరిహద్దుల్లో జరిగిన రూ. 400 కోట్ల భారీ నగదు దోపిడీ కేసు.. ఇప్పుడు 3 రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయంతో కీలక దశకు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులకు సహకరించేందుకు కర్ణాటక, గోవా పోలీసులు కూడా చేతులు కలిపారు. నాసిక్కు చెందిన సందీప్ పాటిల్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్.. జనవరి 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
2025 అక్టోబర్లో.. గోవా నుంచి గుజరాత్లోని ఒక ఆశ్రమానికి రెండు కంటైనర్లలో సుమారు రూ. 400 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను తరలిస్తుండగా.. చోర్లా ఘాట్ వద్ద కొందరు దుండగులు వాటిని దోచుకున్నారు. ఈ దోపిడీ గురించి సమాచారం తెలుసనే నెపంతో తనను కొందరు కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేశారని సందీప్ పాటిల్ ఆరోపించారు.
ఈ కేసు తీవ్రతను బట్టి మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర సిట్ చీఫ్ ఆదిత్య మిర్కెల్కర్ అభ్యర్థన మేరకు.. బెళగావి ఎస్పీ కె. రామరాజన్ ఒక స్పెషల్ టీమ్ను నాసిక్కు పంపించారు. ప్రస్తుతం ఈ కేసు కేవలం ఫిర్యాదుదారుడి వాంగ్మూలంపైనే ఆధారపడి ఉందని బెళగావి ఎస్పీ కె. రామరాజన్ తెలిపారు. కర్ణాటక హోం శాఖ మంత్రి జి. పరమేశ్వర కూడా ఈ కేసుపై స్పందించారు. దోపిడీకి గురైన కంటైనర్ల ఆచూకీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరినట్లు వెల్లడించారు.
ఐదుగురు నిందితుల అరెస్ట్
ఈ కేసులో జయేష్ కదమ్, విశాల్ నాయుడు, సునీల్ ధుమాల్, విరాట్ గాంధీ, జనార్దన్ ధైగుడె అనే ఐదుగురు నిందితులను మహారాష్ట్ర సిట్ అరెస్ట్ చేసింది. మరో ఇద్దరు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడైన సందీప్ పాటిల్ పోలీసులకు కీలకమైన కాల్ రికార్డింగ్లు, వీడియో కాల్ ఆధారాలను అందజేశారు. తనకు ఈ దోపిడీతో సంబంధం ఉందన్న అనుమానంతో బిల్డర్ కిషోర్ సావ్లా సేథ్ తనను రెండు నెలల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఆరోపించారు.
రాజకీయ, ఎన్నికల కోణం
బెళగావి పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భారీ నగదు మహారాష్ట్రలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక రాజకీయ ప్రత్యర్థి వర్గం.. కొందరు పోలీసు అధికారులు, ఒక మత గురువు సహాయంతో ఈ కంటైనర్లను అడ్డుకుని నగదును దోచుకున్నట్లు విచారణలో తేలే అవకాశం ఉందని తెలుస్తోంది. థానేకు చెందిన ఒక ప్రముఖ బిల్డర్కు ఈ నగదు చెందుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బును వైట్ మనీగా మార్చుకోవడానికి గుజరాత్కు తరలిస్తుండగా ఈ దోపిడీ జరిగినట్లు సమాచారం.
Latest News