|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:25 PM
ఉత్తరాఖండ్లోని అత్యంత పవిత్రమైన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో భాగమైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల విషయంలో శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఒక సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. ఈ పురాతన ఆలయాల్లోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతించాలని.. హిందూయేతరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని ఆలయ కమిటీ భావిస్తోంది. అయితే బీకేటీసీ ఆధ్వర్యంలోని బద్రీనాథ్, కేదార్నాథ్ మాత్రమే కాకుండా మొత్తం 45 ఆలయాల్లోని అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించాలని కమిటీ నిర్ణయించింది.
దేవభూమి ఉత్తరాఖండ్లోని మతపరమైన, సాంస్కృతిక సంప్రదాయాలను, ఆలయాల పవిత్రతను కాపాడటం అత్యంత ముఖ్యమని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు. త్వరలోనే జరిగే బోర్డు సమావేశంలో ఈ నిర్ణయంపై అధికారిక తీర్మానం చేయనున్నట్లు వివరించారు. గతంలో కేదార్నాథ్ ఆలయాన్ని చేరుకునే మార్గంలో కొంతమంది మాంసం, మద్యం సేవిస్తూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే, పూజారులు ఆలయ కమిటీకి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు బీకేటీసీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు బీకేటీసీ తీసుకోనున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి చర్యలు తీసుకుంటోందని సంచలన ఆరోపణలు చేస్తున్నాయి.
2026 చార్ధామ్ యాత్ర ప్రారంభ తేదీలు
ఈ ఏడాది చార్ధామ్ యాత్ర కోసం ద్వారాలు తెరిచే తేదీలను ఆలయ కమిటీ ఇప్పటికే ఖరారు చేసింది. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 19వ తేదీన.. గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇక ఏప్రిల్ 23వ తేదీన ఉదయం 6:15 గంటలకు బద్రీనాథ్ ఆలయం భక్తులకు దర్శనం ఇవ్వనుంది.
మరోవైపు.. కేదార్నాథ్ ఆలయాన్ని ఎప్పుడు తెరుస్తారు అనేది ఇంకా ఖరారు చేయలేదు. ఫిబ్రవరి 15వ తేదీ మహా శివరాత్రి రోజున అధికారికంగా తేదీని ప్రకటించనున్నారు. సాధారణంగా ఇది ఏప్రిల్ నెల చివర్లో ఉంటుంది.
Latest News