|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 08:25 PM
కార్ల మార్కెట్లో భారతదేశం సరికొత్త విప్లవానికి తెరలేవబోతోంది. యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకోబోతున్న ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందంలో భాగంగా.. విదేశీ కార్లపై విధిస్తున్న భారీ దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విదేశీ కార్లపై ఉన్న గరిష్ట సుంకం 110 శాతాన్ని ఏకంగా 40 శాతానికి తగ్గించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం నాడే ఈ చారిత్రాత్మక ఒప్పందంపై అధికారిక ముద్ర పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది
ఏయే కార్ల ధరలు తగ్గుతాయి?
ఈ ఒప్పందంలో భాగంగా 15,000 యూరోల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువ కలిగిన కార్లపై తక్షణమే పన్ను తగ్గింపు వర్తించనుంది. తొలుత ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించి, కాలక్రమేణా దానిని 10 శాతానికి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల మెర్సిడెస్ బెంజ్, బిఎమ్డబ్ల్యూ, ఆడి, వోక్స్వ్యాగన్, రెనాల్ట్ వంటి యూరోపియన్ దిగ్గజ సంస్థల కార్లు భారతీయ వినియోగదారులకు తక్కువ ధరకే లభించనున్నాయి. ఏటా సుమారు 2 లక్షల పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లకు ఈ వెసులుబాటు కల్పించనున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై వ్యూహం
విదేశీ కార్ల సుంకాలు తగ్గించినప్పటికీ.. స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన (EV) తయారీదారుల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరించలేదు. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీ దిగ్గజాల పెట్టుబడులను కాపాడేందుకు.. ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి సుంకాల తగ్గింపుపై మొదటి ఐదేళ్లపాటు మినహాయింపు ఇవ్వనున్నారు. ఐదేళ్ల తర్వాతే ఈవీలపై కూడా సుంకాల కోత అమలవుతుంది. ప్రస్తుతం భారతీయ కార్ల మార్కెట్లో సుజుకి, టాటా, మహీంద్రా సంస్థలదే హవా. యూరోపియన్ కార్ల వాటా కేవలం 4 శాతంగానే ఉంది. అత్యధిక పన్నుల కారణంగా ఇక్కడి మార్కెట్లో విస్తరించలేకపోతున్నామని గతంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సహా పలువురు వ్యాపారవేత్తలు విమర్శించారు. తాజా నిర్ణయంతో విదేశీ కంపెనీలు తమ గ్లోబల్ మోడల్స్ను భారత్లో తక్కువ ధరకే ప్రవేశపెట్టి మార్కెట్ను పరీక్షించే అవకాశం దక్కుతుంది.
అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల దెబ్బతిన్న భారతీయ టెక్స్టైల్స్, జ్యువెలరీ రంగాలకు ఈ ఈయూ ఒప్పందం వరం కానుంది. భారత్ నుండి ఐరోపా దేశాలకు ఎగుమతులు పెరగడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. అందుకే ఈ ఒప్పందాన్ని నిపుణులు "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" అని పిలుస్తున్నారు. 2030 నాటికి 60 లక్షల యూనిట్ల వార్షిక అమ్మకాల లక్ష్యంగా ఉన్న భారత ఆటో రంగానికి ఈ ఒప్పందం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది.
Latest News