|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:19 PM
క్రికెట్ ప్రపంచంలో మరో వివాదానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ను బహిష్కరించే (బాయ్కాట్) దిశగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆలోచిస్తున్నట్లు సమాచారం. భారత్లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఐసీసీ ఎంపిక చేసింది. దీనికి నిరసనగా బంగ్లాకు సంఘీభావం తెలుపుతూ పాకిస్థాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. సోమవారం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమైనప్పటికీ తుది నిర్ణయాన్ని వారం చివరికి వాయిదా వేశారు.అయితే, రాజకీయ కారణాలతో టోర్నీని బహిష్కరించడం పాకిస్థాన్ క్రికెట్కు మంచిది కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని పీసీబీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఐసీసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చివరి నిమిషంలో వైదొలగడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనివల్ల ఐసీసీ నుంచి ఏటా అందే 34.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 316 కోట్లు) ఆదాయాన్ని పాకిస్థాన్ కోల్పోవాల్సి వస్తుంది. ఇది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీని మరింత సంక్షోభంలోకి నెడుతుంది.
Latest News