|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 07:11 PM
ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించిన ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం డిస్మిస్ చేసింది. పీలేరు రేంజ్ పరిధిలోని కొంతమంది అటవీ శాఖ ఉద్యోగులు ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు సహకారం అందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులను శాశ్వతంగా విధుల నుంచి తప్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారి అయిన సాయిబాబా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు 2021లో ఎర్రచందనం రవాణాలో స్మగ్లర్లకు సహకారం అందిస్తూ.. తలపుల సెక్షన్ అధికారి శ్రీనివాసన్, ఉస్తికాయల పెంట బీట్ ఆఫీసర్ రెడ్డెప్ప, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ విజయభాస్కర్, నూతన కాల్వ చెక్పోస్ట్ ఆఫీసర్ జయప్ప.. అధికారులకు ఆధారాలతో సహా దొరికిపోయారు. దీంతో ఉన్నతాధికారులు వీరిని సస్పెండ్ చేశారు.
అయితే 2022లో తమ పలుకుబడిని ఉపయోగించి మరోసారి విధుల్లో చేరారు. మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు అటవీ శాఖ సిబ్బంది సహకారంపై ప్రత్యేక పరిశోధన బృందం దర్యాప్తు జరిపింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చిత్తూరులో పర్యటించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. స్మగ్లర్లకు సహకారం అందించే సిబ్బందిని గుర్తించి.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
వీరిలో జయప్ప ఇప్పటికే చనిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసన్, విజయ్ భాస్కర్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలిగిస్తూ జిల్లా అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి మూడో తేదీనే ఈ ఉత్తర్వులు జారీ చేయగా.. అధికారులు గోప్యంగా ఉంచటంతో బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరోవైపు గతేడాది నవంబర్ నెలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం మంగళంలో ఉన్న ఎర్రచందనం గోడౌన్ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లు స్వచ్ఛందంగా లొంగిపోవాలని.. లేకపోతే ప్రత్యేక ఆపరేషన్ ఉంటుందంటూ హెచ్చరించారు. నలుగురు కింగ్పిన్లను గుర్తించామని ప్రకటించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడేవారు తమంతట తామే లొంగిపోవాలని.. లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.