|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 08:59 PM
రాజస్థాన్కు చెందిన ప్రముఖ సాధ్వి ప్రేమ్ బైసా మరణం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, RLP నేత హనుమాన్ బెనివాల్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం, సాధ్వి ప్రేమ్ బైసాను బోరానందా ఆశ్రమం నుంచి ఆమె తండ్రి వీరం నాథ్, మరో సహాయకుడు జోధ్పూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యుడు ప్రవీణ్ జైన్ మాట్లాడుతూ... సాధ్విని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, ఆమెలో ఎటువంటి కదలిక లేదని తెలిపారు. సాధ్వి తండ్రి, ఆమె గురువు కూడా అయిన వీరం నాథ్.. ఆమెకు జ్వరం వచ్చిందని, అందుకే ఒక కాంపౌండర్ను ఆశ్రమానికి పిలిపించామని చెప్పినట్టు డాక్టర్ జైన్ పేర్కొన్నారు. కాంపౌండర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తెలిపారు.
శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ను ఏర్పాటు చేస్తామని వైద్యుడు చెప్పినా.. సాధ్వి తండ్రి నిరాకరించి, తన సొంత కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లారని సమాచారం. సాధ్వి తండ్రి వీరం నాథ్ మాట్లాడుతూ.. తన కుమార్తె చాలా కాలంగా జలుబు, దగ్గుతో బాధపడుతోందని, అందుకే కాంపౌండర్ను పిలిపించామని అన్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని వీరం నాథ్ వివరించారు. ఇక, కాంపౌండర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతడి వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
సాధ్వి ప్రేమ్ బైసా మరణించిన సుమారు నాలుగు గంటల తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ రావడం అనుమానాలకు తావిస్తోంది. ఆ పోస్ట్లో ఆమె తన అనుచరులను ఉద్దేశించి ‘నేను సనాతన ధర్మ ప్రచారానికి ప్రతి క్షణం జీవించాను... నా జీవితమంతా ఆది జగద్గురు శంకరాచార్యులు, ప్రపంచ యోగా గురువులు, గౌరవనీయమైన సాధువుల ఆశీర్వాదాలు అందుకున్నాను. ఆది గురు శంకరాచార్యులకు, దేశంలోని అనేక గొప్ప సాధువులకు అగ్ని పరీక్ష కోరుతూ లేఖలు రాశాను.. కానీ ప్రకృతిలో ఏమి ఉందో? నేను ఈ ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నాను, కానీ దేవునిపై, గౌరవనీయమైన సాధువులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా జీవితకాలంలో కాకపోయినా, నా మరణం తర్వాత, నేను ఖచ్చితంగా న్యాయం పొందుతాను’ అని అందులో రాశారు.
కాగా, సాధ్వి తండ్రి ఈ పోస్ట్ ఆమె మొబైల్ నుంచే షేర్ అయిందని ధ్రువీకరించారు. ‘ఒక సహచర గురు మహారాజ్ సందేశం పంపారు’ అని ఆయన తెలిపారు. ఆయన కూడా తన కుమార్తె మరణంపై విచారణ జరపాలని కోరారు. ఇదిలా ఉండగా, సాధ్వి ప్రేమ్ బైసా, ఆమె తండ్రి గతేడాది ఒక వివాదంలో చిక్కుకున్నారు. తండ్రీకూతుళ్ల వీడియో వైరల్ అయింది. ఆమె తన తండ్రిని గదిలో కౌగిలించుకుంటున్నట్లు వీడియోలో ఉంది. మరో మహిళ గదిలోకి వచ్చి దుప్పటి తీసి, ఆపై బయటకు వెళ్లడం కూడా ఉంది. సాధ్వి దానిని ఆప్యాయత వ్యక్తీకరణగా అభివర్ణించారు. తండ్రీకూతుళ్ల బంధాన్ని కించపరిచే ప్రయత్నమని ఆమె అన్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేసి, వీడియోను వైరల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Latest News