|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 07:25 PM
"అమ్మా.. ఎక్కడున్నావే.. తొమ్మిది నెలలు కడుపున నన్ను మోశావ్.. అలాంటిది తొమ్మిది రోజులైనా నన్ను నీ పొత్తిళ్లల్లో ఉంచుకోలేకపోయావా.. రా అమ్మా.. చలేస్తోందే.. ఇన్ని రోజులు నీ కడుపులో వెచ్చగా పడుకున్నా.. ఇప్పుడీ చలికి తట్టుకోలేకపోతున్నా.. నీ కడుపులో చీకటిగా ఉన్నా హాయిగా ఉండేది.. కానీ ఈ చీకటి నన్ను చంపేస్తోందే.. అదిగో దూరంగా కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి.. గట్టిగా కేకలు వేయడానికి కూడా భయంగా ఉంది.. ఎక్కడున్నావే.. అర్ధరాత్రి, రోడ్డుపైనా, నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి పోయావే.. అమ్మా ఓసారి ఇటు రావే.. పాలివ్వమని మారాం చేయను.. చందమామ రావే అంటూ ఎత్తుకుని తిప్పమని ఏడిపించను.. ఒకే ఒక మాట చెప్పి వెళ్లవే.. నన్నెందుకు కన్నావో ఒక్కటీ చెప్పవే.. నేనంటే ఇష్టం లేనప్పుడు మూడో నెలలోనే ముగిస్తే పోయేది కదా.. ఇటు రావే అమ్మా.."
అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట ఆర్టీసీ బస్డాండులో అర్ధరాత్రి పూట చిమ్మ చీకటిలో, ఎముకలు కొరిగే చలిలో నడి రోడ్డుపై పడున్న ఓ శిశువు ఆవేదన ఇది. తొమ్మిది నెలలు మోసి కన్న తల్లి ఎందుకు వదిలేసిందో తెలియదు.. బతుకు భారమా.. పాపభారమా.. అనేది ఆ దేవుడికే తెలియాలి. కానీ ఎముకలు గడ్డ కట్టే చలిలో.. బొడ్డు కూడా ఊడకముందే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. బుధవారం ఆర్థరాత్రి పూట. కృష్ణదేవిపేట ఆర్టీసీ బస్టాండులో కొంతమంది ప్రయాణికులకు రోడ్డుపై శిశువు కనిపించింది.
ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక ఎస్ఐ వెంటనే అక్కడకు చేరుకున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతోఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్, ఓ అంగన్నాడీ కార్యకర్త వెంటనే అక్కడకు చేరుకున్నారు.
శిశువును కృష్ణదేవిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆ పసికందు ఊపిరి ఆగిపోయింది. ఎముకలు గడ్డకట్టే చలికి ఆ పసిప్రాణం తట్టుకోలేకపోయింది. కృష్ణదేవిపేటలో పసికందును పరీక్షించిన డాక్టర్లు.. చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో శిశువు మృతదేహాన్ని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రాత్రిపూట శిశువును బస్టాండులో ఎవరు వదిలేసి పోయారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీ సాయంతో వదిలి వెళ్లినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Latest News