|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 07:28 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 301 బార్లకు లైసెన్సులు కేటాయించనుంది. బార్ల లైసెన్సుల కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవలే షెడ్యూల్ వెలువరించింది. అయితే వివిధ కారణాలతో బార్ల లైసెన్సుల కోసం పెద్దగా దరఖాస్తులు రాలేదు. ప్రభుత్వం బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించడాన్ని నిరసిస్తూ చాలామంది లిక్కర్ వ్యాపారులు బార్ల లైసెన్సుల దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలలో సీనియర్ అధికారులు రంగంలోకి దిగి చర్చలు జరిపినప్పటికీ ఈ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 శాతం బార్ల లైసెన్సులు అమ్ముడుపోలేదు. మద్యం వర్తకుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏఆర్ఈటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు 2025-28 నూతన బార్ల విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 301 ఓపెన్ కేటగిరీ బార్ల లైసెన్సులకు రీనోటిఫికేషన్ ఇస్తున్నట్లు ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ శ్రీధర్ చామకూరి వెల్లడించారు. ఇటీవల లాటరీ విధానంలో ఓపెన్ కేటగిరీ విధానంలో541 బార్లకు.. 84 బార్లకు రిజర్వ్డ్ కేటగిరీ కింద లైసెన్సులు కేటాయించారు. అయితే 299 బార్ల లైసెన్సులు ఇప్పటికీ అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో ఈ 299 బార్లతో పాటుగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఒక బార్ చొప్పున మొత్తం 301 బార్ల లైసెన్సుల కోసం రీనోటిఫికేషన్ ఇచ్చారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీన లక్కీ డ్రా తీస్తారు.
ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీలో ఇటీవల కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. బార్లపై విధించే ఏఆర్ఈటీని రద్దు చేసింది. 2019 నవంబర్ నుంచి బార్లపై ఈ అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తున్నారు. అయితే ఈ ఏఆర్ఈటీని రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.బార్ల యజమానులపై అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించటంతో పాటుగా లిక్కర్ ధరలలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకే రకమైన మద్యానికి వైన్ షాపులలో ఒకలా, బార్లలో ఒకలా మద్యం ధరలు ఉండకుండా.. సమానంగా లిక్కర్ రేట్లు ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
బార్లపై ఏఆర్ఈటీ రద్దు నిర్ణయంతో బార్ల యజమానులకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో 301 బార్లకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించటంతో ఈ సారి దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Latest News