|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:16 PM
గత కొంత కాలంగా యూఎస్ డాలర్తో పోలిస్తే భారతీయ కరెన్సీ రూపాయి పతనం అవుతూనే ఉంది. అత్యంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయింది. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 92 కు కూడా పడిపోయింది. ఇంకా అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో గతేడాది నుంచి భారతీయ స్టాక్ మార్కెట్ పనితీరు కూడా ఏమాత్రం బాగోలేదు. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటంతో ఇవి పతనం అవుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, పలు దేశాలపై విధిస్తున్న దిగుమతి సుంకాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంటోంది. అయినప్పటికీ.. ఇలాంటి సంక్లిష్ట, సంక్షోభ సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం, వెండి సహా ఇతర విలువైన లోహాలపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫలితంగా వీటి ధరలు పెరుగుతుంటాయి. స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినా.. వీటిల్లో పెట్టుబడుల్ని నిలుపుకుంటుంటారు.
>> అయితే అన్ని వేళలా ఇది సరైనదే కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వైట్ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ రిపోర్ట్ కూడా అదే చెబుతోంది. కొన్ని సార్లు.. స్టాక్ మార్కెట్ పతనం అయినప్పుడు.. ఇంకా రూపాయి పతనం అయినప్పుడు.. ఆ నష్టాల్ని పూడ్చుకునేందుకు బంగారం, వెండి వంటి విలువైన లోహాల్ని కూడా విక్రయించాల్సి వస్తుందని ఫలితంగా వీటి ధరలు కూడా భారీగా తగ్గొచ్చని అభిప్రాయపడుతోంది. ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పొచ్చు.
ఇటీవల ఇంటర్నేషనల్ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా కరెక్షన్ కనిపించింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5600 డాలర్లను తాకినా మళ్లీ అక్కడి నుంచి 15 శాతానికిపైగా పతనంతో 4,800 డాలర్ల స్థాయికి పడిపోయింది. సిల్వర్ విషయానికి వస్తే 120 డాలర్ల వద్ద ఆల్ టైమ్ హైని తాకినా అక్కడి నుంచి 30 శాతానికిపైగా పతనంత 85 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. మరి ఇక్కడ కోలుకునేందుకు ఎంత సమయం పడుతుంది.. మళ్లీ ఆ స్థాయికి చేరతాయా.. గతంలో ఇలాగే గోల్డ్, సిల్వర్, స్టాక్ మార్కెట్ గరిష్ఠాల వద్ద క్రాష్ అయినప్పుడు.. రికవరీకి ఎంత సమయం పట్టింది.. చరిత్ర ఏం చెబుతుందో తెలుసుకుందాం.
>> 2011, ఏప్రిల్ 25న అప్పట్లో వెండి పీక్ స్టేజీకి చేరింది. కిలోకు రూ. 73,288 పలికింది. అయితే ఆ గరిష్ఠాల నుంచి ఏకంగా 55 శాతం పతనం కాగా.. దాదాపు సగానికిపైగా వాల్యూ కోల్పోయింది. ఈ పతనం నుంచి కోలుకొని మళ్లీ ఆ స్థాయి దాటేందుకు ఏకంగా 9 సంవత్సరాలు పట్టింది.
ఇక గోల్డ్ విషయానికి వస్తే 2012, సెప్టెంబర్ 14న అప్పటి గరిష్ట స్థాయిల్ని తాకింది. 10 గ్రాములకు ఒక దశలో రూ. 32,147 పలికింది. అక్కడి నుంచి ఏకంగా 25 శాతం వరకు ధరలు పతనం అయ్యాయి. ఇది వెండితో పోలిస్తే కాస్త తక్కువే అయినా.. ఇక్కడ మళ్లీ ఆ పతనం నుంచి కోలుకొని గరిష్ఠ స్థాయిని అధిగమించేందుకు 7 సంవత్సరాలు పట్టింది.
స్టాక్ మార్కెట్ పతనం నుంచి కోలుకునేందుకు మాత్రం గోల్డ్, సిల్వర్తో పోలిస్తే తక్కువ సమయంలోనే రికవరీ అయింది. నిఫ్టీ 50 విషయానికి వస్తే.. 2010, నవంబర్ 5న 7,917 వద్ద గరిష్ఠాల్ని తాకింది. అక్కడి నుంచి మళ్లీ 27 శాతం పతనం కాగా.. 2.5 సంవత్సరాల్లోనే రికవరీ కావడం విశేషం. ఇక్కడ గోల్డ్, సిల్వర్ కంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. కరెన్సీ బలహీనత ఉన్నా.. ఇక్కడ కరెక్షన్ నుంచి కోలుకునేందుకు చాలా ఏళ్లు పట్టిందని చరిత్ర చెబుతోంది. మరి ఇప్పుడు.. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఈసారి అంతకుమించి 1-2 రోజుల్లోనే భారీ కరెక్షన్ కనిపించింది.