బడ్జెట్‌లో వేతన జీవులకు నిర్మలమ్మ గుడ్‌న్యూస్,,,స్టాండర్డ్ డిడక్షన్ రూ. 1 లక్షకు పెంపు
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:15 PM

కేంద్ర ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లోక్‌సభలో వార్షిక బడ్జెట్ సమర్పించనున్నారు. దీని కోసం వివిధ వర్గాల ప్రజలు.. తమకేం ప్రయోజనం ఉంటుందోనని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటారు. మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆదాయపు పన్ను, టాక్స్ శ్లాబుల్లో మార్పులు, స్టాండర్డ్ డిడక్షన్ , ఇతర పన్ను మినహాయింపు ప్రయోజనాల కోసం చూస్తుంటే.. రైతులు తమకు పథకాల కోసం నిధుల కేటాయింపుల పెంపు, ఎరువులపై సబ్సిడీలు, కొత్త పథకాలు, కనీస మద్దతు ధర పెంపు వంటి వాటి కోసం చూస్తారు. ఇతర వ్యాపారవేత్తలు, పరిశ్రమ వర్గాలు.. వ్యాపారాల్లో ఊతం కోసం కొత్త సంస్కరణల కోసం చూస్తుంటారు. ఇంకా యువత, నిరుద్యోగులు, మహిళలు, పెన్షనర్లు.. తమకు కొత్త పథకాలు, ఇతర ప్రయోజనాల కోసం చూస్తారన్న సంగతి తెలిసిందే.


ఇప్పుడు మనం వేతన జీవులకు పన్ను ప్రయోజనాలు, వారు బడ్జెట్ 2026లో కొత్తగా ఏం కోరుకుంటున్నారో చూద్దాం. కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం.. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తగ్గిస్తూ ఆకర్షణీయంగా మారుస్తోంది. ఇదే సమయంలో పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయట్లేదు. ఇక్కడ కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలతో కలిపి రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ రిబేట్ కారణంగా సున్నా పన్ను ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి స్టాండర్డ్ డిడక్షన్ అంశం తెరపైకి వచ్చింది. స్టాండర్డ్ డిడక్షన్ అంటే.. జీతం పొందే ఉద్యోగులు (వేతన జీవులు), పెన్షనర్లు.. తమ మొత్తం వార్షిక ఆదాయం నుంచి నేరుగా తగ్గించుకోగలిగే స్థిరమైన మినహాయింపు మొత్తంగా చెప్పొచ్చు. ఇక్కడ ఈ ప్రయోజనం పొందేందుకు ఎలాంటి పెట్టుబడి పత్రాలు, ఇతర రికార్డులు, డాక్యుమెంట్లు చూపించాల్సిన పని లేదు. ఉదాహరణకు మీరు ఉద్యోగులు అయి ఉండి.. మీ వార్షిక ఆదాయం 15 లక్షలుగా ఉంటే.. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ కింద కొత్త పన్ను విధానంలో ఇందులో నుంచి రూ. 75 వేలు, పాత పన్ను విధానంలో రూ. 50 వేలు నేరుగా తగ్గించుకొని మిగిలిన దానిపై పన్ను లెక్కించాల్సి ఉంటుంది.


>> ఇప్పుడు ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు రూ. 1 లక్షకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యగులు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80C కింద హెల్త్ ఇన్సూరెన్స్ సహా పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, టాక్స్ సేవర్ ఎఫ్‌డీ ఇలాంటి వాటిపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. కొత్త పన్ను విధానంలో అవేమీ లేవు కాబట్టి.. తమకు పన్ను తగ్గించుకునేందుకు ఈ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచి ఉపశమనం కల్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. ఇదే జరిగితే.. కొత్త పన్ను విధానంవైపు మరింత మంది ఆకర్షితులవుతారని చెబుతున్నారు.


స్టాండర్డ్ డిడక్షన్ చరిత్ర చూస్తే.. 1974లో తొలిసారిగా సెక్షన్ 16 కింద దీనిని ప్రవేశపెట్టారు. 2005-06 లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం దీనిని రద్దు చేశారు. మళ్లీ 13 ఏళ్లకు 2018 బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ తిరిగి ప్రవేశపెట్టారు. అప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 40 వేలుగా ఉంది. తర్వాత 2019 మధ్యంతర బడ్జెట్‌లో దీనిని రూ. 50 వేలకు పెంచారు. ఇక 2024 బడ్జెట్‌లో ఈ పరిమితిని కొత్త పన్ను విధానంలో రూ. 75 వేలకు పెంచగా.. పాత పన్ను విధానంలో రూ. 50 వేలుగానే ఉంది.


Latest News
This budget is not for common people: Oppn Mon, Feb 02, 2026, 12:51 PM
NIA raids multiple places in Kashmir in terror-related case Mon, Feb 02, 2026, 12:46 PM
Afghan police find arms in car, arrest two suspects Mon, Feb 02, 2026, 12:44 PM
On boycotting clash against India, ICC warns Pakistan over selective T20 WC participation Mon, Feb 02, 2026, 12:27 PM
Off-field fallout: Pakistan's ICC match decision puts Colombo tourism at risk Mon, Feb 02, 2026, 12:05 PM