|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:11 PM
వార్షిక బడ్జెట్ 2026-27 సమర్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారోనని సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా సామాన్యులపై వరాలు కురిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్లో 5 పెద్ద ప్రకటనలు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఆదాయపు పన్ను మినహాయింపులు, పీఎం కిసాన్ సాయం పెంపు సహా ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. మరి వాటి గురించిన అంచనాలు తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను
వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని రూ. 13 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000గా ఉంది. దీనిని మరో రూ.25000 పెంచి రూ. 1 లక్షకు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో జీతం తీసుకునే ఉద్యోగులకు రూ. 13 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ప్రస్తుతం టాక్స్ రిబేట్తో కలిపి రూ. 12.75 లక్షల వరకు పన్ను లేదు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయం అందిస్తోంది కేంద్రం. దీన్ని 50 శాతం పెంపుతో రూ. 9,000 వరకు చేయవచ్చని అంచనా. 2019లో ప్రారంభమైన ఈ స్కీమ్ ద్వారా మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పుడు రూ.9 వేలకు చేస్తే ప్రతి విడతలో రైతులకు రూ.3 వేల చొప్పున సాయం అందనుంది.
300కి పైగా కొత్త అమృత్ భారత్, వందే భారత్ రైళ్లు
రిజర్వేషన్లో వెయిటింగ్ లిస్ట్ తగ్గించడం, రైల్వే ట్రాక్లు మెరుగుపరచడం, కొత్త రైళ్లు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 300కి పైగా కొత్త అమృత్ భారత్, వందే భారత్ రైళ్లు ప్రకటిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్లో రైల్వేకు రూ. 2.65 లక్షల కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్ మరింత పెంచవచ్చని సమాచారం. 2030 నాటికి వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యుత్తు సబ్సిడీ స్కీమ్
పీఎం సూర్యా ఘర్ యోజన ద్వారా ప్రస్తుతం 2 కిలోవాట్ వరకు రూ. 30,000 చొప్పున రూ. 60,000 సబ్సిడీ ఇస్తున్నారు. దీన్ని కిలోవాట్ కు రూ. 40,000కు పెంచాలని డిమాండ్ ఉంది. అంటే కుటుంబానికి అదనంగా మరో రూ. 20,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. 2026 మార్చి నాటికి 40 లక్షల ఇళ్లు, 2027 నాటికి 1 కోటి ఇళ్లకు సౌర విద్యుత్తు పలకను అమర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 19.45 లక్షల సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేశారు. 7.7 లక్షల ఇళ్లకు విద్యుత్ బిల్లు జీరో అయింది.
ఆయుష్మాన్ భారత్
ప్రస్తుతం 70 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే అదనంగా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స ఉంది. దీన్ని 60 ఏళ్లకు తగ్గించవచ్చని సమాచారం. సంవత్సరానికి రూ. 5 లక్షల ఉచిత చికిత్స పరిమితిని పెంచడం సహా క్యాన్సర్, హార్ట్ సర్జరీల వంటి పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలను సైతం కవర్ చేసేలా రూల్స్ మార్చవచ్చని సమాచారం. ప్రస్తుతం దేశంలో 60 ఏళ్లు దాటిన వారిలో 82 శాతం మందికి ఎలాంటి ఆరోగ్య బీమా లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆయుష్మాన్ భారత్ వయసు తగ్గించే అవకాశం ఉంది.
Latest News