|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 07:31 PM
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు. ఉండవల్లితో పాటు మాజీ మంత్రి కన్నబాబు కూడా అంబటితో ములాఖత్ అయ్యారు. ఉండవల్లి మాట్లాడుతూ అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసినప్పటి నుంచి తనకు పరిచయమని చెప్పారు. ఆ వ్యక్తిగత పరిచయంతోనే అంబటిని కలిసేందుకు ములాఖత్ కు వచ్చానని తెలిపారు. రాజకీయాల్లో చంద్రబాబు కొత్త ఒరవడిని ప్రారంభించారని తిట్టిన వాళ్లని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తూ కొట్టిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని అన్నారు. ఈ రకమైన సంప్రదాయం మంచిది కాదని చెప్పారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఉండవల్లి మాట్లాడుతూ తిరుమల నెయ్యిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువని సిట్ నివేదికలో ఉందని, చాలా తక్కువ అంటే లేనట్టేనని కానీ చంద్రబాబు పదేపదే జంతువుల కొవ్వు అని మాట్లాడుతున్నారని విమర్శించారు. టాయిలెట్స్ కడిగే లిక్విడ్ కూడా ఉందని అంటున్నారని పవిత్రమైన తిరుమల లడ్డూ గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. బీజేపీ వాళ్లు కూడా చంద్రబాబులా మాట్లాడటం లేదని ఈ విషయంపై చంద్రబాబు పునరాలోచించుకోవాలని సూచించారు.
Latest News