|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 09:24 PM
Ragi Aaviri Kudumu Recipe: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎముకల బలానికి, షుగర్ వ్యాధిగ్రస్తులకు రాగులు ఒక అద్భుతమైన పోషకాహారంగా నిలుస్తాయి.అలాంటి రాగులతో ఎంతో రుచికరంగా, బలవర్ధకంగా తయారు చేసుకునే ‘రాగి ఆవిరి కుడుము’ రెసిపీని ఇప్పుడు తెలుసుకుందాం.
*కావలసిన పదార్థాలు:
రాగి పిండి – 1 కప్పు
ఉప్పుడు బియ్యం (లేదా మామూలు బియ్యం) – 1/2 కప్పు
మినపప్పు – 1/4 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – తగినన్ని
*తయారీ విధానం: ముందుగా మినపప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నానిన పప్పు, బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని అవసరమైనంత నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండీ ఇడ్లీ పిండిలా ఉండేలా చూసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలిపి ఇడ్లీ పిండిలా కన్సిస్టెన్సీ వచ్చేలా సర్దుకోవాలి.ఈ విధంగా సిద్ధమైన పిండిని కనీసం 7 నుంచి 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియబెట్టాలి. ఇలా పులియబెట్టడం వల్ల కుడుములు మరింత మృదువుగా, రుచిగా వస్తాయి. పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఆవిరి కుడుము పాత్రను లేదా ఇడ్లీ పాత్రను తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాయాలి. పాత్రలో పిండిని పోసి ఆవిరిపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. కుడుములు ఉడికిన తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి బయటకు తీసుకోవాలి.ఈ రాగి ఆవిరి కుడుములను వేడివేడిగా అల్లం చట్నీ లేదా వేరుశనగ చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపోయే ఈ టిఫిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి.