|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 09:27 PM
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ దేశంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. విడుదల కాకుండానే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న తన పుస్తక వివాదంపై ఎట్టకేలకు మాజీ చీఫ్ నరవణే మౌనం వీడారు. పబ్లిషర్ పెంగ్విన్ ర్యాండ్ హౌస్ ఇండియా చేసిన ట్వీట్ను షేర్ చేసిన ఆయన.. ‘నా పుస్తకం ప్రస్తుతం స్థితి ఇది’ అంటూ పోస్ట్ పెట్టారు. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ పుస్తకం గురించి లోక్సభలో ప్రస్తావించడంతో రచ్చ మొదలైన విషయం తెలిసిందే. అందులో మే 2020లో చైనాతో సరిహద్దుల్లో ప్రతిష్టంభన సమయంలో జరిగిన సంఘటనను వివరించారు. ఈ పుస్తకం ఇప్పటి వరకు అటు ముద్రణ లేదా డిజిటల్ రూపంలో అధికారికంగా విడుదల కాలేదని ప్రచురణ సంస్థ పెంగ్విన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కాగా, తనకు ఈ పుస్తకం ఎలా వచ్చిందనే దానిపై రాహుల్ గాంధీ స్పష్టత నిచ్చారు. తాను రాసిన పుస్తకం సోషల్ మీడియాలో ఉందని 2023లో నరవణే పోస్ట్ చేశారని తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తన ఆత్మకథ ఉందంటూ డిసెంబర్ 2023లో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నరవణే లింక్ పోస్ట్ చేశారని రాహుల్ వివరించారు. ఆ లింక్ను ఓపెన్ చేయగా ఓ ఆన్లైన్ స్టోర్లో ఆ పుస్తకం లభించిందని చెప్పారు. తాను ఆర్మీ మాజీ చీఫ్ నరవణెనే నమ్ముతున్నానని అన్నారు. ఇదిలా ఉండగా, విడుదల కాకుండానే ఈ బుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, పెంగ్విన్ ఇండియా సైతం కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, అనధికారిక ప్రతులను పంపిణీ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ పుస్తకంలో అంశాన్ని మొదటిసారి లేవనెత్తారు. దీనిపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తంచేయడం, కేంద్ర మంత్రులు కూడా అడ్డుతగిలారు. ఇదే సమయంలో రాహుల్ మైక్ను స్పీకర్ కట్ చేయడంతో ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఈ క్రమంలో 8 మంది విపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయడం మరింత అగ్గి రాజేసింది. అప్పటి నుంచి లోక్సభ కార్యకలాపాల్లో అంతరాయం కొనసాగుతోంది. ధన్యవాద తీర్మానంపై లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం లేకుండానే ఆమోదం పొందింది.
Latest News