|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 10:48 PM
సరదాగా బయటకు వెళ్లిన ఒక కుటుంబానికి మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. హోటల్ సిబ్బంది చేసిన ఒక చిన్న పొరపాటు.. మూడేళ్ల చిన్నారిని ఆసుపత్రి పాలు చేసింది. ముఖ్యంగా చిన్నారి కోసం నీళ్లు అడిగితే.. సిబ్బంది మరిగిన నీళ్లను తెచ్చి ముందు పెట్టారు. విషయం తెలియని బుజ్జాయి.. ఆ నీళ్లు తాగగా నోరంతా కాలిపోయింది. నొప్పితో విలవిల్లాడగా విషయం గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. సింగపూర్లోని 'క్వీన్స్వే'లో ఉన్న మెక్డొనాల్డ్స్ రిడౌట్ టీ గార్డెన్లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
సింగపూర్ మాజీ జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు రిధువాన్ ముహమ్మద్ ఫిబ్రవరి 1వ తేదీన తన భార్య, మూడేళ్ల కుమార్తెతో కలిసి మెక్డొనాల్డ్స్ అవుట్లెట్కు వెళ్లారు. అక్కడే తన కుమార్తె వాటర్ బాటిల్లో నింపడానికి చల్లటి నీరు కావాలని ఆయన అక్కడి సిబ్బందిని కోరారు. అయితే ఆ సిబ్బంది ఆర్డర్ను తప్పుగా అర్థం చేసుకుని.. చల్లటి నీటికి బదులుగా మరుగుతున్న వేడి నీటిని బాటిల్లో నింపారు. బాటిల్ తిరిగి ఇచ్చేటప్పుడు కూడా అది వేడిగా ఉందని సిబ్బంది ఎలాంటి హెచ్చరిక చేయలేదు.
అయితే లోపల చల్లటి నీళ్లే ఉన్నాయని భావించిన తండ్రి.. దానిని తన కుమార్తెకు ఇచ్చారు. ఆ చిన్నారి బాటిల్ తెరిచి ఒక గుక్క తాగగానే.. విపరీతమైన వేడికి నాలుక కాలిపోయి నొప్పితో విలవిల్లాడింది. పాప ఎంతకూ ఏడుపు ఆపకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్స చేసి చిన్నారి నొప్పిని తగ్గించారు. అయితే ఈ ప్రమాదం తర్వాత చిన్నారి తీవ్ర భయాందోళనకు లోనైందని, నాలుక కాలడం వల్ల కొన్ని రోజుల పాటు ఆహారం, నీరు కూడా తీసుకోలేకపోయిందని తండ్రి రిధువాన్ ఫేస్బుక్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
"సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే నా కుమార్తెకు ఈ పరిస్థితి వచ్చింది. సర్వింగ్ ఏరియా మాకు కనిపించదు. కనీసం ఇచ్చేటప్పుడైనా అది వేడి నీళ్లని చెప్పి ఉంటే ఈ ప్రమాదం తప్పేది" అని ఆయన పేర్కొన్నారు. అయితే ఒక తండ్రిగా తాను కూడా ఇచ్చే ముందు చెక్ చేయకపోవడం తప్పేనని ఆయన అంగీకరించారు. ఇలాంటి ఘటనలు మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు తెలిపారు.
మెక్డొనాల్డ్స్ స్పందన
ఈ ఘటనపై మెక్డొనాల్డ్స్ యాజమాన్యం అధికారికంగా క్షమాపణలు చెప్పింది. బాధితులకు 'గుడ్విల్' కింద 10 "బీ అవర్ గెస్ట్" కార్డులను అందజేసింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధి తెలిపారు. ముఖ్యంగా వేడి పదార్థాలను సర్వ్ చేసేటప్పుడు సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండేలా వారికి శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు.
Latest News