|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 08:40 PM
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం నేటితరం యువత ఎంతకైనా తెగిస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినిమా హీరోహీరోయిన్లు వరకు అందరూ రీళ్ల మోజులో పడి చట్టాలను సైతం మర్చిపోతున్నారు. తాజాగా కర్ణాటకలోని కలబురగిలో ఓ కాంగ్రెస్ నేత చేసిన 'తుపాకీ' విన్యాసం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. బ్లాక్ బస్టర్ సినిమా 'దురంధర్'లోని ఒక సీన్ తరహాలో మారణాయుధాలను ప్రదర్శిస్తూ ఆయన చేసిన వీడియో ఇప్పుడు పోలీసుల విచారణకు దారితీసింది.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలబురగి పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలో ఉండి, బహిరంగంగా ఆయుధాలను ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఈక్రమంలోనే మంగళవారం రోజు విలేకరులతో మాట్లాడిన కలబురగి పోలీస్ కమిషనర్ శరణప్ప ఎస్.డి.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
నిగ్గు తేల్చాల్సిన ప్రశ్నలు..
పోలీసుల దర్యాప్తులో ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా వీడియోలో కనిపిస్తున్న పిస్తోల్, తుపాకులు నిజమైనవేనా లేక డమ్మీవా అని తేల్చాల్సి ఉంది. ఒకవేళ అవి నిజమైన ఆయుధాలే అయితే వాటికి సరైన లైసెన్స్ ఉందా? ఎవరి పేరు మీద ఆ లైసెన్స్ ఉంది? వంటి వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా లైసెన్స్ ఉన్నప్పటికీ.. ఆయుధాలను ఇలా ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధం కాగా.. సోషల్ మీడియా రీళ్ల కోసం వాడటం ఆయుధ చట్టం కింద నేరం కావడం వల్ల ఆయన్ను అరెస్ట్ చేసే అకాశం ఉందని చెబుతున్నారు.
కఠిన చర్యలు తప్పవు..
వీడియో చిత్రీకరించిన ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో గుర్తించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఒకవేళ విచారణలో ఆ ఆయుధాలు అక్రమమని తేలితే.. మతీన్ పటేల్పై ఆయుధ చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ ఘటనపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. అధికార పార్టీ నేతలకు చట్టాలంటే భయం లేకుండా పోయిందని విమర్శిస్తున్నాయి.
Latest News