|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 09:44 PM
గతేడాది జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో హడలెత్తిస్తున్నారు. ముఖ్యంగా ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ట్రంప్ ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా, స్విట్జర్లాండ్పై విచిత్రమైన కారణంతో 39 శాతం సుంకాలను విధించినట్టు ఆయన బయటపెట్టారు. స్విస్కు చెందిన నాయకురాలు తనతో ఫోన్లో మాట్లాడిన తీరు నచ్చలేదనే ఆ దేశంపై టారీఫ్లను మరో 9 శాతానికి పెంచి 39 శాతం విధించారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
‘‘స్విట్జర్లాండ్పై సుంకాలను 30 శాతానికి పెంచిన తర్వాత నాకు ఆదేశం నుంచి ఒక ఎమర్జెన్సీ కాల్ రావడంతో ప్రధాని కాల్ చేశారని అనుకున్నాను.. ఫోన్లో నాతో మాట్లాడిన మహిళా నేత తీరు నాకు నచ్చలేదు..... మాది చాలా చిన్నదేశమని, ఈ సుంకాలు మేం భరించలేమని ఆమె అంటే, అమెరికాతో వాణిజ్యం వల్ల 42 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని నేను చెప్పాను. అయినా ఆమె సర్.. సర్.. పదేపదే మాది చిన్నదేశమని అనడంతో చిర్రెత్తుకొచ్చి సుంకాలను 30 శాతం నుంచి 39 శాతానికి పెంచాను.. ఎటువంటి టారీఫ్లు కట్టకుండానే అమెరికాను ఉత్పత్తులను స్విట్జర్లాండ్ ఎగుమతి చేస్తోంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో సుంకాలను 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
కాగా, ట్రంప్ టారీఫ్లను 30 శాతానికి పెంచిన తర్వాత స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరిన్ కెల్లర్ సట్టర్ అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేశారు. గత నెలలో దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సదస్సులోనే స్విస్ను ఉద్దేశించి ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, సుంకాలు లేకుండా ఉత్పత్తులను ఎగుమతి చేసి అమెరికాను దశాబ్దాలుగా దోపిడీ చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ‘‘నేను మరో 40 దేశాలతో కూడా ఇదే చెప్పగలను. కొన్ని చాలా దారుణంగా వ్యవహరిస్తున్ానయని’ అని ఆయన అన్నారు. అయితే, వాగ్వాదం జరిగినప్పటికీ స్విట్జర్లాండ్కు సుంకాలను 15 శాతానికి తగ్గించడానికి ట్రంప్ అంగీకరించడం గమనార్హం. 2028 నాటికి స్విస్ సంస్థలు అమెరికాలో 200 బిలియన్ల డాలర్ల పెట్టుబడులకు మాట ఇవ్వడంతోనే ట్రంప్ వెనక్కి తగ్గారు.
Latest News