|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 07:59 AM
టెక్ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగులకు కీలకమైన, స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా లేని వారు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి వైదొలగవచ్చని తెలిపింది. ఈ మేరకు అమెరికాలోని తమ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ విభాగంలోని కొంతమంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించింది.గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ ఈ మేరకు ఉద్యోగులకు ఒక అంతర్గత మెమో పంపారు. కంపెనీ ప్రస్తుతం ఏఐపై వేగంగా దృష్టి సారిస్తోందని, ఈ వేగాన్ని అందుకోలేని వారు లేదా గూగుల్ నుంచి వైదొలగాలని భావించేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఏఐపై ఆల్ ఇన్దృక్పథంతో ఉన్న ఉద్యోగులు మాత్రమే కంపెనీకి అవసరమని ఆయన స్పష్టం చేశారు.ఆట వేగంగా మారుతోంది, పోటీ తీవ్రంగా ఉంది, పందెం చాలా పెద్దది అని ఆయన తన మెమోలో వ్యాఖ్యానించారు.గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 2025 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్లకు పైగా రికార్డు స్థాయి ఆదాయాన్ని ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా గూగుల్ క్లౌడ్, ఏఐ విభాగాల వృద్ధి ఈ లాభాలకు దోహదపడింది. అయితే, ఈ స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కంపెనీలోని అందరికీ వర్తించదు. కస్టమర్లకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అమెరికాలోని లార్జ్ కస్టమర్ సేల్స్ వంటి కొన్ని విభాగాలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఏఐ కేంద్రంగా తమ వ్యాపారాలను పునర్వ్యవస్థీకరించుకునే వ్యూహంలో భాగంగానే గూగుల్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Latest News