|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:27 PM
బ్యాంకు రుణాలు తీసుకున్న వారు వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రుణగ్రహీతల ఇళ్లలో మరణాలు సంభవించినప్పుడు లేదా ఏదైనా విషాదం చోటుచేసుకున్నప్పుడు బ్యాంకులు బలవంతపు వసూళ్లకు దిగకూడదని స్పష్టం చేసింది. అలాగే పెళ్లిళ్లు వంటి శుభకార్యాల సమయంలోనూ రికవరీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. మానవీయ కోణంలో ఆలోచించి, కస్టమర్ల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని బ్యాంకులకు ఆర్బీఐ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
రుణ రికవరీ విధానం అనేది అన్ని బ్యాంకుల్లోనూ ఒకే రకమైన నిబంధనలతో కూడి ఉండాలని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం మాత్రమే ఏజెంట్ల నియామకం జరగాలని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని పేర్కొంది. రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలకు చేసే ప్రతి ఫోన్ కాల్ను తప్పనిసరిగా రికార్డ్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనివల్ల వసూళ్ల సమయంలో ఏజెంట్లు అనుచితంగా ప్రవర్తిస్తే ఆ రికార్డింగుల ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
కస్టమర్ల వ్యక్తిగత సమాచార భద్రతపై కూడా ఆర్బీఐ ఈసారి గట్టిగా దృష్టి సారించింది. రుణగ్రహీతల ఫోన్ నంబర్లు, అడ్రస్ వంటి సున్నితమైన డేటాను బ్యాంక్ ఉద్యోగులు లేదా థర్డ్ పార్టీ ఏజెంట్లు దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా బ్యాంకులదేనని తేల్చి చెప్పింది. డేటా ఉల్లంఘనలు జరిగితే సంబంధిత బ్యాంక్ యాజమాన్యాలనే బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. కస్టమర్ల ప్రైవసీకి భంగం కలగకుండా డిజిటల్ భద్రతా ప్రమాణాలను పెంచాలని సూచించింది.
కేవలం వసూళ్లపైనే కాకుండా, రుణగ్రహీతలతో వ్యవహరించే తీరుపై బ్యాంకులకు నిర్దిష్టమైన శిక్షణ అవసరమని ఆర్బీఐ అభిప్రాయపడింది. రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయాలని, అసభ్య పదజాలం వాడకూడదని పాత నిబంధనలు ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేస్తోంది. సామాన్యులను మానసిక ఆందోళనకు గురిచేసే ఏ చర్య అయినా చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందని ఆర్బీఐ ఈ కొత్త మార్గదర్శకాల్లో వివరించింది.