|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:11 PM
ఫిబ్రవరి 14.. రెండో శనివారం.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు. దీంతో విద్యార్థులు తెగ సంబరపడిపోతుంటారు. ఆ వెంటనే ఆదివారం కూడా ఉండటంతో రెండు రోజులు సెలవు వచ్చిందనే ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ జిల్లాలో మాత్రం రేపు రెండో శనివారం సెలవు లేదు . విద్యాసంస్థలు యధావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి హెడ్మాస్టర్లు, ప్రిన్సిపళ్లకు ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
2025 అక్టోబర్ నెలలో ఏపీలో మొంథా తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురవగా.. ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లా అధికారులు కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 27,28,29వ తేదీలలో జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అయితే విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని.. ఈ సెలవు రోజులకు బదులుగా రెండో శనివారాల్లో పనిచేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే నవంబర్ నెలలో వచ్చిన రెండో శనివారం (నవంబర్ 8), డిసెంబర్ నెల రెండో శనివారం (డిసెంబర్ 13) విద్యాసంస్థలు పనిచేశాయి. ఫిబ్రవరి రెండో శనివారం ( ఫిబ్రవరి 14) కూడా స్కూళ్లు పనిచేయనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు ఈ నిర్ణయం వర్తించనుంది. ఈ నేపథ్యంలో రేపు (ఫిబ్రవరి 14) యథావిధిగా కార్యకలాపాలు సాగించాలంటూ వైఎస్సార్ కడప జిల్లాలోని అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపల్స్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
సాధారణంగా వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు జిల్లా కలెక్టర్.. సెలవుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తుంటారు. అయితే విద్యా సంవత్సరంలో పనిదినాలు తగ్గకూడదనే ఉద్దేశంతో మిగతా సెలవు రోజులలో తరగతులు నిర్వహించి.. వీటిని భర్తీ చేస్తుంటారు.
Latest News