|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:45 PM
మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మహిళలకు శుభవార్త చెప్పారు. ఒక్కో మహిళకు రూ.5 వేలు చొప్పున మొత్తం 1.3 కోట్ల మంది ఖాతాల్లోకి కలైంగర్ పథకం కింద జమచేసినట్టు స్టాలిన్ వెల్లడించారు. ఈ మొత్తంలో సమ్మర్ స్పెషల్గా రూ.2,000తో పాటు మహిళలకు నెల నెల అందించే రూ.1000 ఆర్థిక సహాయాన్ని ముందుగానే అందజేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ మూడు నెలలకు రూ.3 వేలు, అదనంగా రూ.2000 కలిపి మొత్తం రూ.5వేలు వారి అకౌంట్లలో జమ చేసినట్లు స్టాలిన్ వివరించారు..
ఈ పథకం లక్ష్యం మహిళలకు ఆర్థిక స్వాలంభన, సంక్షేమం, సాధికారత, స్వయం ఉపాధి కల్పించడమేనని తెలిపారు. అయితే, ఎన్నికల పేరుతో ఈ పథకాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని డీఎంకే అధినేత ఆరోపించారు. ఈ విషయంలో ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా తాను మాత్రం వెనక్కి తగ్గనని స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడులో అభివృద్ధి కొనసాగాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా నిలవాలని మహిళలను ఆయన అభ్యర్థించారు. తమిళనాడు అసెంబ్లీ ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్ల చేజారిపోకుండా స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ వరకూ మూడు నెలల సొమ్మును ఒకేసారి వారి ఖాతాలకు జమ చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకే, విజయ్ పార్టీ టీవీకే మధ్య ఉంటుందని భావిస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నటుడు విజయ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నారు. ఇదే సమయంలో డీఎండీకేతో అన్నాడీఎంకే చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, విజయ్తో పొత్తులకు బీజేపీ ప్రయత్నిస్తున్నా.. ఆయన మాత్రం ఒంటరి పోరుకే సై అంటున్నారు. దీంతో తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో డీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందని వెల్లడయ్యింది. పార్టీ కంటే స్టాలిన్ ఎక్కువ శాతం మద్దతు పొందడం గమనార్హం.