|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:35 PM
ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తూ మాట్లాడితే అవి రెండు చిన్న మాటలు ఎలా అవుతాయి అంటూ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేయడాన్ని సమర్థించారు. వైసీపీ అధినేత జగన్ ఈ అంశాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. శుక్రవారం నాడు శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలోరాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బొమ్ము ఇజ్రాయేల్ చేసిన ఆరోపణలను లోకేశ్ గట్టిగా తిప్పికొట్టారు.అధికార ప్రతిపక్ష సభ్యులెవరైనా మహిళలను కించపరిచేలా మాట్లాడకూడదని, అలాంటి వారిని ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన సభకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడైనా చెప్పండి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తప్పా ఒప్పా మీరు దాన్ని సమర్థిస్తున్నారా అని వైసీపీ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. జగన్ రెడ్డి తల్లి అయినా ఎవరి తల్లైనా అక్కాచెల్లెళ్లయినా వారిని కించపరిస్తే ప్రజాప్రభుత్వం సహించబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారని లోకేశ్ గుర్తుచేశారు. లోకేశ్ మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ఇది వాస్తవమా కాదా ముఖ్యమంత్రి తల్లిని అంత దారుణంగా మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అలాంటి వాళ్లను వదిలిపెడతామా సభ లోపలైనా బయటైనా మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని స్పష్టం చేశారు. మహిళల గౌరవానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ అంశాన్ని తేలికపరిచే ప్రయత్నం చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు.అంబటి రాంబాబు కేవలం రెండు చిన్న మాటలు అన్నారని జగన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం సిగ్గుచేటు. ఒక తల్లిని అవమానిస్తూ మాట్లాడిన మాటలు చిన్నవి ఎలా అవుతాయి సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు, కానీ మాకు ఆ సంస్కారం ఉంది బాధ్యత ఉంది. మహిళల జోలికి వెళితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని లోకేశ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, కేవలం మహిళల గౌరవాన్ని కాపాడేందుకే కఠినంగా వ్యవహరిస్తోందని వివరించారు.తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని వివరిస్తూ మా సొంత పార్టీ కార్యకర్త ఒకరు వైఎస్ భారతీరెడ్డి గారి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, తక్షణమే చర్యలు తీసుకుని జైలుకు పంపించాం. అదీ మహిళల పట్ల మాకున్న గౌరవం, మా చిత్తశుద్ధి. కానీ మీరు ఐదేళ్లలో ఏం చేశారు మా పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు, ఇదే సభలో మా తల్లిని అవమానించినప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని లోకేశ్ వైసీపీ నేతలను నిలదీశారు.
Latest News