|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:32 PM
భారత రాజకీయాల్లో మరోసారి 'బహిష్కరణ' రాజకీయం వేడెక్కుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే.. ఆయన్ను లోక్సభ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్కు నోటీసు ఇచ్చారు. రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించాలని దూబే కోరారు. ఈ క్రమంలోనే అసలు రాజ్యాంగ బద్ధంగా ఒక ఎంపీని సభ నుంచి ఎలా బహిష్కరిస్తారు? దానికి ఉన్న ప్రక్రియ ఏమిటి? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఎంపీ బహిష్కరణ ప్రక్రియ ఎలా సాగుతుందంటే..?
లోక్సభ సభ్యుడిని తొలగించడం అనేది ఒక సుదీర్ఘమైన, చట్టబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రధానంగా ఐదు దశల్లో సాగుతుంది. ముందుగా సభలోని ఏ సభ్యుడైనా మరో సభ్యుడిపై ఫిర్యాదు చేస్తూ స్పీకర్కు అధికారికంగా నోటీసు ఇవ్వవచ్చు. అయితే ఈ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్.. దానిని ప్రివిలేజ్ కమిటీకి లేదా ఎథిక్స్ కమిటీకి విచారణ నిమిత్తం పంపిస్తారు. ఈ కమిటీ ఆరోపణలపై లోతైన విచారణ జరుపుతుంది. అవసరమైతే సాక్షులను పిలుస్తుంది. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీకి తన వాదనను వినిపించుకునే అవకాశం కూడా ఇస్తుంది. విచారణ అనంతరం కమిటీ తన నివేదికను, సిఫార్సులను సిద్ధం చేస్తుంది.
ఆ తర్వాత కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభలో ప్రవేశపెడతారు. ఒకవేళ ఆ ఎంపీ తప్పు చేసినట్లు కమిటీ నిర్ధారించి, బహిష్కరణను సిఫార్సు చేస్తే.. దానిపై సభలో తీర్మానం ప్రవేశ పెడతారు. సభకు హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆ తీర్మానానికి మద్దతుగా ఓటు వేస్తే.. సదరు ఎంపీ సభ్యత్వం వెంటనే రద్దు అవుతుంది.
2023లోనూ రాహుల్ గాంధీపై బహిష్కరణ..
రాహుల్ గాంధీకి బహిష్కరణలు కొత్తేమీ కాదు. 2023లో 'మోదీ ఇంటిపేరు' వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పుడు 'ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951' లోని సెక్షన్ 8(3) ప్రకారం ఆయన సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అయింది. అయితే చట్టం ప్రకారం.. ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే ఎంపీ పదవి పోతుంది. కానీ సుప్రీం కోర్టు ఆ శిక్షపై స్టే విధించడంతో రాహుల్ సభ్యత్వం పునరుద్ధరించబడింది.
ఇప్పటి డిమాండ్ భిన్నమైంది..!
ప్రస్తుతం నిషికాంత్ దూబే డిమాండ్ చేస్తున్న బహిష్కరణ చట్టపరమైన శిక్ష ద్వారా కాకుండా, సభా మర్యాదలను ఉల్లంఘించారనే కారణంతో జరుగుతోంది. అంటే కోర్టు తీర్పుతో పని లేకుండా సభ తనంతట తానుగా ఒక సభ్యుడిని తొలగించే ప్రక్రియ ఇది. రాహుల్ గాంధీ ప్రసంగాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. స్పీకర్ ఈ నోటీసును కమిటీకి పంపిస్తారా లేదా అన్నదానిపైనే రాహుల్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Latest News