|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 09:01 PM
ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో సంచలనం సృష్టించిన లంబోర్గిని కారు ప్రమాద కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాదచారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అతివేగంతో కారు నడిపిన ఘటనలో నిందితుడు, ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్ర కుమారుడు శివమ్ మిశ్రాను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టు జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఉదయమే అరెస్ట్ అయిన అతడు మధ్యాహ్నానికి విడుదల కాగా.. దేశ వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఘటన జరిగిన నాలుగు రోజులకు అరెస్ట్
సుమారు నాలుగు రోజుల క్రితం కాన్పూర్ వీధుల్లో అతివేగంగా దూసుకొచ్చిన లంబోర్గిని కారు పాదచారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బౌన్సర్లు వేరే కారులో వచ్చి నిందితుడు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే స్థానికుల సమచారాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు శివమ్ మిశ్రానే అని తెలుసుకున్నారు. నాలుగు రోజులుగా అతడి కోసం తీవ్రంగా గాలించగా.. గురువారం అతడు పట్టుబడ్డాడు. ఈక్రమంలోనే అతడిని 14 రోజుల రిమాండ్కు అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే న్యాయస్థానం రిమాండ్ అభ్యర్థనను తోసిపుచ్చి.. కేవలం రూ. 20 వేల పూచీకత్తుపై అతడికి బెయిల్ మంజూరు చేసింది.
సినిమా ఫక్కీలో 'డమ్మీ' డ్రైవర్ లొంగుబాటు యత్నం
ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు నిందితుడి కుటుంబం భారీ స్కెచ్ వేసింది. ప్రమాదం జరిగిన సమయంలో శివమ్ కారు నడపలేదని, అసలు డ్రైవర్ తానేనంటూ మోహన్ అనే వ్యక్తిని కోర్టులో లొంగిపోయేలా ప్లాన్ చేశారు. అయితే పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షులు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో స్టీరింగ్ పట్టింది శివమ్ మిశ్రానే అని ప్రాథమికంగా నిర్ధారించడంతో డమ్మీ డ్రైవర్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
మరోవైపు ఈ కేసు దర్యాప్తులో మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక ఇన్స్పెక్టర్పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా నిందితుడికి సహకరించేలా వ్యవహరించారన్న ఆరోపణలతో సదరు ఇన్స్పెక్టర్పై వేటు వేయబోతన్నట్లు సమాచారం. బడా వ్యాపారవేత్తల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితుడిని గుర్తించినప్పటికీ.. కోర్టులో రిమాండ్ దక్కకపోవడం పోలీసు వర్గాలను విస్మయానికి గురిచేసింది.
Latest News