|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:30 PM
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, వీరనారి మహారాణి పద్మిని చిత్రాలను హర్యానాలో తీవ్రంగా అవమానించారు. ఫరీదాబాద్లోని ఒక ప్రైవేట్ బ్యాంక్వెట్ హాల్ నిర్వాహకులు శౌచాలయాల వద్ద లింగ సూచికలుగా వీరి చిత్రాలను వాడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా దీనిపై స్పందించిన ఓ కాంగ్రెస్ ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..?
హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంకెట్ హాల్లో పురుషుల టాయిలెట్ తలుపుపై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాన్ని, మహిళల టాయిలెట్ తలుపుపై మహారాణి పద్మిని చిత్రాన్ని అతికించారు. సాధారణంగా స్త్రీ, పురుషుల గుర్తులను వాడాల్సిన చోట.. ఇలాంటి చారిత్రక వీరుల చిత్రాలను ఉపయోగించడం పట్ల నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 17వ శతాబ్దపు గొప్ప పాలకుడిగా, ధైర్య సాహసాలకు నిలువుటద్దంగా నిలిచే శివాజీ చిత్రాన్ని ఇలాంటి చోట వాడటం అక్షరాలా వికృత చేష్టేనని మరాఠా సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ వీరుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. శివాజీ మహారాజ్ మాకు దైవంతో సమానం అని.. ఆయన గౌరవానికి భంగం కలిగేలా చేసిన ఈ చర్యపై హర్యానా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ చిత్రాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మహారాష్ట్రకు చెందిన శివసేన నేత షైనా ఎన్సీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. "శివాజీ మహారాజ్ను మేము దైవంగా పూజిస్తాం. ఇలాంటి అవమానాన్ని సహించేది లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున మేము హర్యానా సర్కారుతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.
విచారణకు డిమాండ్.. క్షమాపణలు చెప్పాలని పట్టు!
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు బ్యాంకెట్ హాల్ యాజమాన్యంపై నిప్పులు చెరుగుతున్నారు. సదరు బ్యాంక్వెట్ హాల్ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై అటు హాల్ యాజమాన్యం గానీ, ఇటు హర్యానా అధికారులు గానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
Latest News