|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:32 PM
జమ్మూ కశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాదుల ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ త్రాషి-ఐ (Operation Trashi-1)ను చేపట్టాయి. దట్టమైన అటవీ, పర్వత ప్రాంతంలో చేపట్టిన ఈ ఆపరేషన్ భద్రతా బలగాల ధైర్య సాహసాలకు, సహనానికి నిదర్శనంగా నిలిచింది. కిష్ఠావర్ జిల్లాలోని ఛత్రూ అటవీ ప్రాంతంలో మొత్తం 326 రోజుల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో ఏడుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పాకిస్థాన్ సైన్యం నుంచి శిక్షణ పొందిన ఈ ఉగ్రవాదులు.. భారత భధ్రతా బలగాల నుంచి తప్పించుకోడానికి క్లిష్టమైన పర్వతాలను, దట్టమైన అడవులను ఉపయోగించుకునేవారు. దాదాపు ఏడాది పాటు ఆపరేషన్ సైట్లోనే భద్రతా దళాలు ఉండిపోయాయంటే వారి సంకల్పం ఏంటో అర్ధమవుతుంది. తరచూ ఎన్కౌంటర్లు జరిగేవి, కానీ ఉగ్రవాదులు తప్పించుకుని అడవుల్లోకి పారిపోయేవారు. ఆ ప్రాంతంలో మైదానాలు, రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆపరేషన్ సవాల్గా మారింది
శీతాకాలంలో ఎముకలు కొరికే చలి, ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా సైన్యం ఆ ప్రాంతంలోనే ఉండిపోయింది. ఉగ్రవాదులను తుడిచిపెట్టాలనే వారి దృడసంకల్పం ముందు ప్రతికూల వాతావరణం తలవంచింది. సైన్యం చూపిన తెగువతో ఆపరేషన్ భారీగా విజయవంతమైంది. ఆదివారం ఉదయం జైషే మహమ్మద్ టాప్ కమాండర్ పాకిస్థాన్ ఉగ్రవాది సైఫుల్లాహ్ను హతమార్చాయి. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాంతంలో తప్పించుకుని తిరుగుతున్న అతడు 20 సార్లు సైన్యం కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. 2016లో సైన్యం హతమార్చిన హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ మాదిరిగానే సైఫుల్లా భద్రతా దళాలను ఇబ్బంది పెట్టడానికి, కశ్మీర్ లోయలో అలజడి సృష్టించడానికి అన్ని వ్యూహాలను ప్రయత్నించాడు. అతడ్ని కాల్చి చంపడంతో ఉగ్రవాద నెట్వర్క్ ధ్వంసమైంది.
మంచు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్షిష్టమైన ఛాత్రూ రీజియన్లో పర్వతాల్లో చేపట్టిన ఈ ఆపరేషన్కు ఇండియన్ ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ నాయకత్వం వహించింది. సైనికుల శౌర్యం, దృఢ సంకల్పంతో పాటు ఆర్మీ, జమ్మూ కశ్మీర్ స్పేషల్ ఆపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ అద్భుతమైన సమన్వయం ఆపరేషన్ విజయానికి దోహదపడింది. స్థానిక నివాసితుల మద్దతు, ఖచ్చితమైన సైనిక నిఘా కీలక పాత్ర పోషించాయి.
అలాగే, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు, మానవరహిత వాహనాలు, శాటిలైట్ ఇమేజనరీ సహా అత్యాధునిక సాంకేతికతను సైన్యం ఈ ఆపరేషన్కు వినియోగించింది. దృఢమైన, అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆపరేషన్కు తోడ్పడింది... సైనికులు అన్ని పరిస్థితులలోనూ కనెక్ట్ అయ్యారు. ‘‘ఉగ్రవాద నెట్వర్క్కు భారీ దెబ్బ.. మేము సేవ చేస్తాం.. మేము రక్షిస్తాం’ అని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్లో పేర్కొంది.కాగా, ఈ ఆపరేషన్లో స్నిప్పర్ డాగ్ టైసన్ కీలక పాత్ర పోషించింది. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారో గుర్తించిన టైసన్.. ముష్కరుల కాల్పుల్లో గాయపడినా వెనక్కి తగ్గలేదు.
Latest News