|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:38 PM
కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పుపై కొనసాగుతున్న సస్పెన్షన్ ఇంకా వీడలేదు.సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం మరోసారి ఆసక్తికర పోరు నెలకుంది. సీఎం మార్పు తప్పదని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ సాగదీత పార్టీకి మంచిది కాదని, 2028 ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానాన్ని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కర్ణాటక పంచాయతీ హైకమాండ్కు పంటి కింద నలుసులా మారింది. ఈ తరుణంలో మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కోరుతూకాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు సీఎం సిద్ధరామయ్య, డీకేలకు తొలిసారి గెలిచిన 38 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారు.
కొత్తగా ఎన్నికైన తమకు క్యాబినెట్లో అవకాశం కల్పించాల్సి కోరుతూ ‘యువ నాయకత్వం కోసం ప్రజల నుంచి వచ్చిన స్పష్టమైన తీర్పు’ అని వారు ఆ లేఖలో అభివర్ణించారు. 2023 ఎన్నికల్లో విజయం తర్వాత 34 మందితో ఏర్పడిన మంత్రివర్గంలో తమలో ఎవరికి అవకాశం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. ‘మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారికి కూడా క్యాబినెట్లో చోటు కల్పించడం న్యాయమైందే’ అని డిమాండ్ చేశారు. కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని కోరిన వారు.. కనీసం ఐదుగుర్ని క్యాబినెట్లోకి తీసుకుంటే అనుభవానికి యువశక్తి,తోడైతే పాలన మరింత మెరుగుపడటానికి సహాయపడుతుందని వాదించారు. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన తమకు మంత్రులుగా అవకాశం కల్పించడం అవసరమని పేర్కొన్నారు.
అంతేకాదు, భారత రాజకీయాల్లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్లోకి తీసుకోవడం అసాధారణమేమీ కాదన్న వారు.. పలు రాష్ట్రాల్లో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా, సీఎంలుగా కీలక బాధ్యతలు అప్పగించిన సందర్భాలున్నాయని వారు గుర్తుచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతం, పారదర్శక పాలన పట్ల తమ నిబద్ధతను నొక్కి చెబుతూ.. యువ ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించడం వల్ల పార్టీ సంస్థాగతంగా బలోపేతమవుతుందని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుందని ఆ ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాయకత్వం మార్పుపై మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ అధిష్ఠానికి ఈ లేఖతో కొత్త చిక్కు వచ్చి పడింది.
నాయకత్వ మార్పుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. తనను దెబ్బతీయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని, సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన తనపై రాజకీయ కుట్రలు సహజమేనని సిద్ధరామయ్య అన్నారు. అయితే, తాను పిరికివాడిని కాదని, అలాగే తన రాజకీయ జీవితం పూలబాట కాదన్నారు. ప్రజా మద్దతుతోనే రాళ్లు, ముళ్లున్న రాజకీయ రహదారిని దాటుతూ వచ్చానని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల తనను కలిసిన మంత్రులు సతీష్ జార్ఖిహోళి, మాజీ మంత్రి రాజణ్ణ, ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం సూచిస్తామని చెప్పారు. మరోవైపు, సీఎం మార్పు విషయంలో జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, సిద్ధరామయ్య మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది.