|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:47 PM
ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్పిన్గా పేరుగాంచిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమేసియో ఒసెగ్యురా సెర్వంటెస్ అలియాస్ ఎల్ మెంచో ఎట్టకేలకు హతమయ్యాడు. ఆదివారం మెక్సికో ప్రత్యేక దళాలు నిర్వహించిన అత్యంత రహస్య ఆపరేషన్లో ఎల్ మెంచో తన ఇద్దరు బాడీగార్డులతో సహా ప్రాణాలు కోల్పోయినట్లు మెక్సికో రక్షణ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఆపరేషన్లో మొత్తంగా 70 మందికి పైగా మరణించడం అక్కడి భీకర పరిస్థితికి అద్దం పడుతోంది.
ప్రేయసిపై నిఘా.. డాన్కు చెక్!
దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న ఎల్ మెంచోను పట్టుకోవడానికి మెక్సికో దళాలు ఒక వ్యూహాత్మక ప్లాన్ వేశాయి. ఎల్ మెంచో ప్రేయసి కదలికలపై నిఘా ఉంచిన అధికారులు.. ఆమెను కలిసేందుకు ఎల్ మెంచో రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా శుక్రవారం రోజు ఆమె జాలిస్కోలోని టపాల్పాలో ఎల్ మెంచోను కలిసేందుకు వెళ్లగా.. అమెరికా ఇంటెలిజెన్స్ సాయంతో అధికారులు వారి ఉనికిని ఖచ్చితంగా గుర్తించారు. ఆ రాత్రి ఆమెతో గడిపిన తర్వాత ఎల్ మెంచో బయటకు వచ్చే లోపు ఆరు హెలికాప్టర్లు, వందలాది మంది సైనికులతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
అడవిలో భీకర పోరు.. రాకెట్ లాంచర్ల దాడి
ఆదివారం తెల్లవారుజామున ఆపరేషన్ ప్రారంభం కాగానే ఎల్ మెంచో ముఠా అడవిలోని క్యాబిన్ల వెనుక దాక్కోని రాకెట్ లాంచర్లతో సైన్యంపై విరుచుకుపడింది. ఇలా రెండు వర్గాల మధ్య జరిగిన పోరులో ఒక మిలిటరీ హెలికాప్టర్ దెబ్బతిని అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. సైన్యం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టగా.. పొదల మధ్య దాక్కున్న ఎల్ మెంచో, అతని బాడీగార్డులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు రక్షణ కార్యదర్శి జనరల్ రికార్డో ట్రెవిల్లా తెలిపారు.ఇదీ చూడండి: మెక్సికో మాఫియా డాన్ 'ఎల్ మెంచో' హతం.. అల్లర్లు ఎక్కువవడంతో భారత పౌరులకు కీలక అడ్వైజరీ
ఎల్ మెంచో మరణవార్త తెలిసిన వెంటనే అతని కుడిభుజం ‘ఎల్ తులి’ అరాచకాలకు తెరలేపాడు. ప్రతి సైనికుడి తలకి 20 వేల పెసోల (సుమారు వెయ్యి డాలర్లు, భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.90,000) రివార్డు ప్రకటించి మరీ దాడులు చేయించాడు. ఈ అల్లర్లలో 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులు, ఒక ప్రాసిక్యూటర్ కార్యాలయ ఉద్యోగి సహా పలువురు మరణించారు. చివరికి పారాట్రూపర్ బ్రిగేడ్ జరిపిన కాల్పుల్లో ఎల్ తులి కూడా హతమయ్యాడు. అతని వద్ద నుంచి 1.4 మిలియన్ డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెక్సికో నూతన అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఈ ఆపరేషన్ వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎల్ మెంచో మరణంతో కార్టెల్ గ్యాంగ్లు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండటంతో మెక్సికో వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.