పోలవరం-నల్లమల అనుసంధానంతో రెండు రాష్ట్రాలకూ లాభమేనన్న సీఎం చంద్రబాబు
 

by Suryaa Desk | Thu, Feb 26, 2026, 07:22 PM

పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, దీనిపై పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వృథాగా సముద్రంలోకి పోతున్న గోదావరి వరద జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా తరలిస్తామని ఆయన శాసనసభలో వివరించారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు తాము ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు. ఈ అనుసంధాన ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. గురువారం నాడు శాసనసభలో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.రాష్ట్రంలో నీటి భద్రతకు కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళుతోందని చంద్రబాబు తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా నీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పరిశ్రమలు, పెట్టుబడులకు నీరే కీలకమని అన్నారు. రాష్ట్రంలోని జలాశయాల్లో ప్రస్తుతం 793 టీఎంసీల నీరు నిల్వ ఉందని, అందుకే ఈసారి పంటల సీజన్‌ను ముందుకు జరిపి, వచ్చే ఏడాది మే 15 నుంచే నారుమళ్లకు నీరందించేలా ప్రణాళిక రచించామని ప్రకటించారు. ఈ విషయంపై రైతులను చైతన్యవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు. ప్రతి ఎకరాకు నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడమే తన లక్ష్యమని, దీనికోసం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై త్వరలోనే ఒక బ్లూప్రింట్ విడుదల చేస్తామని వెల్లడించారు.రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనివేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 2014-19 మధ్య సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలోనే రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులు వచ్చాయని, తాము పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి, శ్రీశైలంలో 100 టీఎంసీలు రాయలసీమకు తరలించామని వివరించారు. అందుకే ఆ ప్రాంతం నేడు రతనాల సీమగా మారుతోందన్నారు.గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు రాకుండానే రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఆ ప్రాజెక్టు మొదటి దశను ఈ ఏడాది జూలైలోనే పూర్తి చేసి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.2500 కోట్లు అవసరమని, ఇప్పటికే ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.456 కోట్లతో శంకుస్థాపన చేశామని తెలిపారు. అదేవిధంగా కుప్పం కాలువలో ట్యాంకర్లతో నీళ్లు పోసి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసి డయాఫ్రాం వాల్‌ను గోదావరిలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టును మళ్లీ పరుగులు పెట్టించి పుష్కరాల కంటే ముందే పూర్తి చేస్తామన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాలు 793 టీఎంసీల నీటితో కళకళలాడుతున్నాయని సీఎం తెలిపారు. జల సంరక్షణ చర్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు సగటున 6 మీటర్లు పెరిగాయని, దీనివల్ల రూ.91 కోట్ల విద్యుత్ ఆదా అయిందని వివరించారు. తాను చేయని తప్పుకు 53 రోజులు జైల్లో పెట్టారని, అయినా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న సంకల్పంతో పనిచేస్తున్నానని అన్నారు. నీటి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, కొందరు కేవలం రాజకీయం కోసమే నీటి సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు, పరిశ్రమలకు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Latest News
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM
T20 WC: Sikandar Raza's superb 73 carries Zimbabwe to 153/7 against South Africa Sun, Mar 01, 2026, 05:08 PM
Protests erupt in Hyderabad over Khamenei's killing Sun, Mar 01, 2026, 05:03 PM
Israel-US attack on Iran: Karnataka Deputy CM condemns strikes on school Sun, Mar 01, 2026, 04:51 PM
Muslim clerics condemn killing of Khamenei, call for peace Sun, Mar 01, 2026, 03:41 PM