|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:30 PM
అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన వంద కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ జిల్లా కలెక్టర్ అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని వైయస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ... అనకాపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న కన్యాకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన భూమిని జిల్లా కలెక్టర్ అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. 111 ఏళ్ల క్రితం (1915లో) దూరి కామమ్మ అనే మహిళ బ్రాహ్మణ సత్రం కోసం 2.49 ఎకరాల భూమిని దానమిచ్చిన భూమి దేవాదాయ శాఖది కాదని, ప్రైవేటు వ్యక్తులదని కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. దేవాదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం కలెక్టర్కు లేదని, కేవలం ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే ఏదైనా జరగాలని గుర్తు చేశారు. కానీ ఆఘమేఘాలమీద కూటమి ప్రభుత్వం రాగానే కేవలం రెండు వారాల్లోనే తాసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు చేరడం వెనుక భారీ కుంభకోణం ఉందని గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు. మరోవైపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉండి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన కలెక్టర్, కాసుల కోసం కక్కుర్తి పడి కంచె చేను మేసినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. గడిచిన 20 నెలలుగా అనకాపల్లి కలెక్టర్ తీసుకున్న ప్రతి రెవెన్యూ నిర్ణయం మీద సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దేవుడి భూములను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
Latest News