|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:44 PM
అనకాపల్లి జిల్లాలో దేవాదాయశాఖ భూములు ఆవిరైపోతున్నాయి అని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వాపోయారు. అయన మాట్లాడుతూ... కలెక్టరేట్ లో అవినీతి కాసులు గలగలలాడుతున్నాయి. గత 20 మాసాలుగా జిల్లా మెజిస్ట్రేట్ గా ఉన్న వ్యక్తి , ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన వ్యక్తే అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం దారుణం. ఐఏఎస్ వ్యవస్థకే ఇలాంటి వ్యక్తులు కళంకం తెస్తున్నారు. కూటమి నేతలు రాజకీయ లబ్ది కోసం ఒకవైపు దేవుడ్ని, మతాన్ని వాడుకుంటుంటే.. మరోవైపు అధికారులు ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డం దారుణం. సత్రం కోసం దానమిచ్చిన భూమిని గతంలో కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని కూడా మేం అడ్డుకున్నాం. సాధారణంగా భూమి దానమిచ్చిన వారి వారసులు ముందుకు రావడం సహజం.. కానీ కౌలుదారులు ఎలా మందుకు వస్తారు, వారికి ఏ విధంగా ఈ భూమిని కట్టబెడతారు? వంద కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమవుతుంటే.. అధికారపార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇన్నేళ్లలో ఇంతటి వివాదాస్పద కలెక్టర్ ను ఎప్పుడూ చూడలేదు? రాజకీయ పార్టీ నేతల తరహాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం ఎంతవరకు సమంజసం? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు సన్నిహితులైన మురళీ, ఇతర టీడీపీ నేతలతో అంటకాగుతూ అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ఇంత భారీ భూకుంభకోణం జరుగుతున్నా రెవెన్యూ మంత్రి మౌనంగా ఉన్నారంటే.. ఈ అక్రమార్జనలో మీక్కూడా వాటాలున్నాయా? సమాధానం చెప్పాలి. వందకోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. దీనికోసం వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని ధర్మశ్రీ హెచ్చరించారు.
Latest News