|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:43 PM
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు భవితవ్యం నేడు తేలిపోనుంది. సూపర్ 8 దశలో ఇప్పటివరకు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన సల్మాన్ అలీ అఘా సేన.. సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే శ్రీలంకతో జరగనున్న మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితం పాకిస్థాన్ టోర్నీ భవిష్యత్తును నిర్ణయించనుంది.సూపర్ 8 గ్రూప్ 2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నిన్న జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడం పాకిస్థాన్కు కలిసొచ్చింది. దీంతో సెమీ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ తన సూపర్ 8 తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడాల్సి ఉండగా, వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది.ప్రస్తుతం పాయింట్ల పరంగానే కాకుండా నెట్ రన్రేట్ (NRR) విషయంలోనూ పాకిస్థాన్, న్యూజిలాండ్ కంటే వెనుకబడి ఉంది. అందుకే సెమీస్ బెర్త్ ఖరారు కావాలంటే శ్రీలంకపై కేవలం గెలిస్తే సరిపోదు, భారీ తేడాతో విజయం సాధించి నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకోవాలి. ఐసీసీ ప్రకారం పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే శ్రీలంకపై 65 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే నిర్దేశిత లక్ష్యాన్ని 13 ఓవర్లలోపే పూర్తి చేయాలి. అయితే, మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిశాకే కచ్చితమైన సమీకరణాలు స్పష్టమవుతాయి.
Latest News