|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:18 PM
ఢిల్లీ మద్యం విధానం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలతో పాటు మరో 21 మందిని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఈ క్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవని, సిసోడియా, ఇతర నిందితులపై ప్రాథమికంగా ఎలాంటి రుజువులు లేవని వ్యాఖ్యానించింది. మద్యం పాలసీలో ఎటువంటి విస్తృత కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం లేదని తేల్చిచెప్పింది. సీబీఐ దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయని, సరైన ఆధారాలే లేవని పేర్కొంది. అంతేకాదు, సీబీఐను ఆర్థిక నిరక్ష్యరాసులతో పోల్చింది.
ఇదిలా ఉండగా, ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED ) సైతం మనీల్యాండరింగ్ కింద ప్రత్యేకంగా కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. సీబీఐ కేసులో అందర్నీ కోర్టు నిర్దోషులుగా తేల్చడంతో ఈడీ కేసు ఏం జరుగుతుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
ఢిల్లీ ఎక్సైజ్ కేసులో తమ దర్యాప్తు స్వతంత్రంగా సాగుతోందని, వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి సేకరించిన విశ్వసనీయ ఆధారాలు, సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని ఈడీ చెబుతోంది. ఆగస్టు 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ కేసును నమోదు చేసింది. ఈ కేసులో మార్చి 21, 2024న అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేసి, ఆయనపై ప్రాసిక్యూషన్ దాఖలు చేసింది. గతేడాది జనవరిలో మద్యం పాలసీ కేసులోలో మనీలాండరింగ్ వ్యవహారంపై కేజ్రీవాల్, సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) EDకి అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ మద్యం కేసు ఏంటి?
నవంబరు 2021లో, అప్పటి ఆప్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది.. రిటైల్ మద్యం అమ్మకాలలో ప్రైవేట్ వ్యక్తులను అనుమతిస్తుంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 580 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జులై 2022లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ పాలసీని రద్దు చేసింది. కానీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు నిర్వహించింది.
ఆగస్టు 2022లో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అనంతరం మార్చి 2023లో, సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది. అదే ఏడాది అక్టోబర్లో, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. మార్చి 2024లో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. తరువాత అదే ఏడాది జూన్లో ఇదే కేసులో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించింది.
Latest News