|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:28 PM
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరో 21 మంది రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్ ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. అయితే, ఈ కేసులో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని, సిసోడియా లేదా ఇతర నిందితులపై ప్రాథమికంగా ఎటువంటి కేసు లేదని జడ్జ్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీలో ఎటువంటి విస్తృతమైన కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం లేదని చెబుతూ.. సీబీఐ కోర్టు విమర్శలు చేసింది.
సీబీఐ దాఖలు చేసిన సుదీర్ఘమైన ఛార్జ్షీట్లో అనేక లోపాలు ఉన్నాయని, సరైన ఆధారాలు లేదా సాక్షులు వాంగ్మూలాలకు మద్దతు లేదని కోర్టు తూర్పారబట్టింది. ఛార్జ్షీట్లో కుట్ర సిద్ధాంతం స్పష్టంగా ఉందని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై కుట్ర సిద్ధాంతం నిలబడలేదని కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవని, ఆయనను ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయనపై ఆరోపణలు న్యాయ విచారణలో నిలబడలేకపోయాయని స్పష్టం చేస్తూ, మనీష్ సిసోడియా విషయంలోనూ ఎలాంటి నేరపూరిత ఉద్దేశం కనిపించలేదని కోర్టు తేల్చిచెప్పింది.
ఇక, దర్యాప్తు తీరుపై కూడా న్యాయస్థానం తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా సీబీఐ అనుసరించిన విధానాన్ని తప్పుబట్టింది. అంతేకాదు, దర్యాప్తులో లోపాలను కప్పిపుచ్చుకోడానికి అప్రూవర్లు వాంగ్మూలం ఆధారంగా ఇతరులను నిందితులుగా చేర్చడం పట్ల మండిపడింది. అటువంటి ప్రవర్తనను అనుమతిస్తే రాజ్యాంగ సూత్రలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవులుంది.. నిందితుడికి క్షమాభిక్ష పెట్టి, ఆ తర్వాత అప్రూవర్గా మార్చి.., దర్యాప్తు లోపాలను సరిదిద్దడానికి, అదనపు వ్యక్తులను నిందితులుగా చేర్చడానికి అతడి వాంగ్మూలాన్ని వాడుకోవడం తప్పు’’ అని కోర్టు పేర్కొంది.
ఖచ్చితమైన సాక్ష్యం కంటే కేవలం ఊహాగానాలపైనే ఆధారపడ్డారని, అందుకే కోర్టు విచారణలో నిలబడలేకపోయాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 23 మంది నిందితులలో ఎవరిపైనా ప్రాథమికంగా ఎటువంటి కేసు నమోదు చేయలేదని తేల్చిచెప్పిన న్యాయమూర్తి.. తక్షణమే ఈ కేసు నుంచి వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు.
అంతేకాదు, ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగి కుల్దీప్ సింగ్ను మొదటి నిందితుడిగా పేర్కొన్నందుకు సీబీఐ అధికారులపై శాఖాపరమైన విచారణకు సిఫార్సు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ‘‘మీపై అభియోగాలకు ఎటువంటి ఆధారాలు లేవు.. మిమ్మల్ని ఎందుకు ఇరికించారో నాకు ఆశ్చర్యంగా ఉంది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టు ఏఎన్ఐ నివేదించింది.
కేజ్రీవాల్ తరఫున లాయర్ వివేక్ జైన్ మాట్లాడుతూ.. కోర్టు అన్ని రికార్డులను జాగ్రత్తగా పరిశీలించిందని అన్నారు. ‘‘సీబీఐ సమర్పించిన అన్ని ఆధారాలను తాము నిశితంగా పరిశీలించామని, ఒక్క ఆరోపణ కూడా నేరారోపణ పరిమితిని దాటలేదని కోర్టు పేర్కొంది. ఆరోపణలు నిరూపించే ఆధారం ఏదీ లేదని చెబుతూ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. సంస్థాగత రక్షణల ద్వారా మద్యం పాలసీ రూపకల్పన జరిగిందని కోర్టు చెప్పింది’’ అని తెలిపారు. మరోవైపు, కింది న్యాయస్థానం తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేయనుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
Latest News