|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 08:03 PM
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఖమేనీ హతమైన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ధృవీకరించిన కొద్ది సేపటికే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి పాలకుడు ఎవరనేది తనకు ఖచ్చితంగా తెలుసంటూ వ్యాఖ్యానించగా.. ఈ కామెంట్లు అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
ఖమేనీ వారసుడిపై ట్రంప్ సెటైర్లు..
సీబీఎస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారనే ప్రశ్నపై ఆసక్తికరంగా స్పందించారు. "అక్కడ ఎవరు పగ్గాలు చేపడతారో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ పేర్లు చెప్పలేను. అక్కడ కొంతమంది మంచి అభ్యర్థులు కూడా ఉన్నారు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే ఇరాన్ వర్గాలే తనకు ఫోన్ చేసి.. ఎవరిని నియమించాలో సలహా అడుగుతారంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అక్కడితో ఆగకుండా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్తో చర్చలు జరపడం చాలా సులభం అని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే ఖమేనీని "చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తి"గా అభివర్ణించిన ట్రంప్.. ఈ దాడిని ఇరాన్ ప్రజలకు దక్కిన న్యాయంగా పేర్కొన్నారు. శాంతి స్థాపన కోసం ఈ యుద్ధం వారం రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని కూడా హెచ్చరించారు. మరోవైపు ఈ దాడులను అక్రమమని ఖండించిన ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడులకు దిగింది.
ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 200 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఫ్లయింగ్ మిషన్. టెహ్రాన్లోని ఖమేనీ నివాసం పూర్తిగా నేలమట్టం అయింది. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు, కోడలు కూడా మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అలాగే ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్, కీలక సలహాదారు అలీ షమ్ఖానీ వంటి అగ్రనేతలు కూడా హతమయ్యారు.