హర్మూజ్ జలసంధిని దాటిన ఎల్పీజీ నౌకలు,,,గ్యాస్ కొరత వేళ భారత్‌కు బిగ్ రిలీఫ్
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 08:02 PM

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్.. గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుండటంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాపై భారీ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ గ్యాస్ కొరత వేధిస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హర్మూ్జ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక చల్లటి వార్త చెప్పింది. భారత్‌కు ఎల్పీజీని తీసుకువస్తున్న రెండు షిప్‌లు హర్మూ్జ్ జలసంధిని సురక్షితంగా దాటి బయటికి వచ్చినట్లు తెలిపింది.


ఇక పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధికి రెండు వైపులా వందల కొద్దీ నౌకలు చిక్కుకుపోయాయి. అయితే భారత జెండాలు ఉన్న నౌకలను హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ఇప్పటికే ఇరాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు.. శనివారం సురక్షితంగా హర్మూజ్‌ జలసంధిని దాటినట్లు కేంద్ర భారత ప్రభుత్వం వెల్లడించింది. శివాలిక్‌, నందాదేవి పేరు ఉన్న గల నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నట్లు కేంద్రం షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సిన్హా స్పష్టం చేశారు.


ఈ శివాలిక్, నందాదేవి నౌకల్లో సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రెండు నౌకలు.. ఈనెల 16వ తేదీ లేదా 17వ తేదీన భారత్‌ తీరానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గత కొన్ని రోజులుగా దేశంలో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతోన్న వేళ.. ఈ రెండు షిప్‌లు త్వరలోనే భారత్‌కు చేరుకోనుండటం భారీ ఊరటను కలిగించే అంశంగా మారింది.


మరోవైపు.. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాలో ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గృహాలకు వినియోగించే సిలిండర్ల విషయంలో ప్రజలెవరూ ఆందోళన పడొద్దని తేల్చి చెప్పింది. గ్యాస్ కొరత ఊహాగానాలతో అవసరం లేకపోయినా చాలామంది వినియోగదారులు ముందస్తుగా బుకింగ్‌ చేస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల బ్లాక్‌మార్కెట్‌ను అడ్డుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది. అదే సమయంలో ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే దేశంలో గ్యాస్‌, ఎల్పీజీ సరఫరా, నిల్వలపై పెరుగుతున్న ఆందోళనల వేళ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పెట్రోలియం శాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు.


ప్రాధాన్యత క్రమంలో వాణిజ్య సిలిండర్లను సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నామని వివరించారు. ఎల్పీజీ సరఫరాలో ఇళ్లు, హాస్పిటల్స్, హాస్టళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సిలిండర్‌లు బుకింగ్ కావడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్న పెట్రోలియం శాఖ అధికారులు.. గ్రామాల్లో 45 రోజులు, పట్టణాల్లో 25 రోజుల కనీస బుకింగ్ గడువు ఉందని గుర్తు చేశారు.

Latest News
MMA: Puja Tomar eyes crucial Strawweight win at UFC Macau Thu, Apr 02, 2026, 11:09 AM
Solar power surge helps TN manage rising summer demand Thu, Apr 02, 2026, 11:09 AM
CBI arrests Srinagar EPFO official, aide for bribery Wed, Apr 01, 2026, 04:35 PM
Mizoram leads Northeast region as first state to launch digital Census 2027, self-enumeration drive Wed, Apr 01, 2026, 04:28 PM
Gujarat Dy CM presides over jobs for differently-abled staff, aid to farmers' heirs Wed, Apr 01, 2026, 04:16 PM