|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 12:06 PM
ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అడిగారు. సీఎం సూచనల మేరకు కసరత్తు చేశామని.. నిధుల లభ్యతను బట్టి చెల్లింపులను జరుపుతున్నామని అధికారులు వివరించారు. ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. వీటితో పాటు గ్రాట్యుటీ బకాయిల కింద రూ. 3,411 కోట్లు, పెండింగులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్క్యాష్మెంట్ కింద రూ. 1,800 కోట్లు, పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవుల నిమిత్తం రూ. 223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని మరో రెండు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. తల్లికి వందనం తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతోంది ఉద్యోగులకు మాత్రమేనని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Latest News