హైదరాబాద్లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక రాజధానికే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ భారీ పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నారు. 2016లో నవంబరు 13న ఈ పార్కుకు అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మెగా ఫుడ్ పార్క్ కోసం సేకరించిన మొత్తం భూమిలో 85.85 ఎకరాల భూమిని ఆహారశుద్ధి ప్రత్యేక మండలిగా మార్చింది.
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వివిధ దేశాల్లో అధ్యయనం చేసి పార్క్కు సంబంధించిన మాస్టర్ ఫ్లాన్ రూపొందించారు. స్థానికంగా లభించే పండ్లు, ఇతర పంటలతో ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు గాను ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం స్థలంలో 41.26 ఎకరాలను నిర్మాణాలకు కేటాయిచారు. ఇతర మౌలిక వసతులు, రోడ్లకు 10.45 ఎకరాలు కేటాయించారు. రూ.109.44 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, వాననీటి పారుదల వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్, ఫ్యూరిఫైడ్ వాటర్ వసతి సౌకర్యం కల్పించారు. మెగా ఫుడ్ పార్కు కోసం విశాలమైన ఆఫీసు, సరకుల నిల్వ గోడౌన్, స్టాండర్డ్ డిజైన్ కర్మాగారం, వ్యర్థాల శుద్ధి కేంద్రం, క్యాంటీన్, ప్యాక్ హౌస్, శిక్షణ కేంద్రం, కోల్డ్ స్టోరేజీ, వేబ్రిడ్జిలను నిర్మించారు. వేయింగ్, వాషింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ వంటి సదుపాయాలతో పాటు రీఫర్ వ్యాన్లు, రీపెనింగ్ ఛాంబర్లు, మెటీరియల్ హ్యాండ్లింగ్ సదుపాయాలు కల్పించారు.
పార్కులో పారిశ్రామిక యూనిట్లకు దరఖాస్తులు కోరగా.. 70 సంస్థలు ప్రస్తుతం ముందుకొచ్చాయి. వీటిలో అయిదు సంస్థలకు ఇప్పటికే స్థలాలు కేటాయించారు. మిగిలిన సంస్థలకు వివిధ పంటలకు సంబంధించిన యూనిట్లు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా అధునాతన రైస్ మిల్లులు, తవుడు నూనె తయారీ, పామాయిల్, వెర్మిసెల్లి, బియ్యం ఆధారిత స్నాక్స్, నూడుల్స్, పల్ప్డ్ రైస్ ఇతర ఆహార ఉత్పత్తుల యూనిట్లు, ప్యాక్ హౌస్.. కూరగాయలు, మిర్చి, పండ్లు, మొక్కజొన్న శుద్ధి యూనిట్లు మసాలాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా యూనిట్లు.. మాంసాహార పదార్థాల శుద్ధి, చేపల యూనిట్లకు స్థలాలను కేటాయిస్తారు. ఈ పార్క్ ఏర్పాటుతో దాదాపు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మెగా ఫుడ్ పార్కును ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa