ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో భవనాలు అడిగిన చంద్రబాబు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 09:26 PM

హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. గంట 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో విభజన అంశాలతోపాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాలకు సంబంధించి మరిన్ని అంశాలపై చర్చించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ రెండు కమిటీల్లో ఒకటి మంత్రులతో కూడిన కమిటీ.. మరొకటి అధికారులతో ఏర్పాటు చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు.


మంత్రులతో కూడిన కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది తొలి భేటీ అని.. తర్వాత మరిన్ని సమావేశాలు నిర్వహించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 లలో ఉన్న అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


అయితే తెలంగాణలో ఉన్న కొన్ని భవనాలను.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు.. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విజ్ఞప్తికి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని సమాచారం. తెలంగాణలో ఉన్న స్థిరాస్తులను ఏపీకి ఇచ్చే ప్రసక్తి లేదని.. రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న భవనాలన్నీ తెలంగాణకు మాత్రమే చెందుతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. కానీ అర్జీ పెట్టుకుంటే తెలంగాణలో భూమి కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారని సమాచారం. ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలో తెలంగాణలో ఓ భవనాన్ని నిర్మించుకునేందుకు పర్మిషన్ ఇస్తామని రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది.


ఉమ్మడి రాష్ట్ర విభజన వేళ తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాయాలని ఇద్దరు సీఎంలు చర్చించినట్లు తెలుస్తోంది. భద్రాచలం మండలంలోని ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయితీలను రేవంత్ రెడ్డి అడిగినట్లు సమాచారం. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిల గురించి కూడా సీఎంల సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే తెలంగాణకు ఏపీ విద్యుత్ బకాయిలు చెల్లించాలని రేవంత్ రెడ్డి.. చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య చాలా అంశాలు గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో ఈ ఒక్క భేటీతో అవన్నీ పరిష్కారం కావని భావించి.. మంత్రులు, అధికారుల కమిటీ విస్తృతంగా చర్చించేందుకు ఆ కమిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.


ఈ భేటీకి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బి.సి.జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, చీఫ్ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa