బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా గుడ్బై చెబుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కారు పార్టీకి గుడ్బై చెప్పారు. ఇక చేరికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకుంది. తాజాగా.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కారు పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ది, అనుచరుల కోరిక మేరకు రేవంత్ పాలన నచ్చి తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వెల్లడించారు. కాగా, బండ్ల చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ మహిళా నేత సరితా తిరుపతయ్యను అధిష్ఠానం బుజ్జగించినట్లు తెలిసింది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ వీక్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవకపోటవంతో మరింత బలహీనపడింది. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్ కుమార్. తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య పార్టీ మారారు. గురువారం (జులై 4) రాత్రి బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వారితో సంప్రదింపులు జరిగాయని.. రేపు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అయితే వారెవరనేది ఉత్కంఠగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa