ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తమ్ సతీమణికి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అరికపూడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 07:09 PM

ఓవైపు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకుని నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. మరోవైపు మూడు కమిటీలను తెలంగాణ శాసన సభ ఏర్పాటు చేసింది. పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ టేకింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా శాసనసభ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌ (Telangana PAC Chairman) గా అరికపూడి గాంధీని, ఎస్టిమేషన్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డిని, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే కె.శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాసన సభ ఏర్పాటు చేసిన మూడు కమిటీల్లో ఒక్కోదాంట్లో 12 మంది చొప్పున సభ్యులను నియమించింది.


అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులోనూ.. పీఏసీ పదవి అరికెపూడి గాంధీకి ఇవ్వటంపై హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ ఛైర్మన్ పదవి అరికపూడి గాంధీకి ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. పీఏసీ బాధ్యతలు ప్రతిపక్ష నాయకులకు ఇస్తారని గుర్తు చేసిన హరీష్ రావు.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన అరికపూడికి ఆ పదవిని కట్టబెట్టడమేంటని హరీష్‌ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. ఈ పీఏసీ పదవి కోసం.. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ నామినేషన్ వేశారు.


ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీఏసీ ఛైర్మన్ బాధ్యతలను అప్పటి ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యేకు ఇవ్వటం గమనార్హం. కమిటీలు ఏర్పాటు చేసే సమయానికి కాంగ్రెస్ కంటే.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంఐఎం నుంచే ఉండటంతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ విషయంలో ఏ ప్రాతిపధికన నిర్ణయం తీసుకున్నది అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa