చెరువులు, నాలాల్లో నిర్మాణాలను కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా.. మరింత దూకుడు పెంచింది. కబ్జాలు చేసినవారు ఎంత మహామహులైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో హైడ్రాకు మరో కీలక బాధ్యత అప్పగించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే భవన నిర్మాణాలు చేపట్టేలా అధికారాలు కల్పిచనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విధి, విధానాలను రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో హైడ్రా కూడా భాగస్వామ్యం కానుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (NOC) ఉంటేనే ఇకపై నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.
హైడ్రా ఎన్ఓసీ ప్రయోజనాలివే..
ఇదొక మంచి పరిణామమేనని రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది అమల్లోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఇళ్ల కొనుగోలుదారులకు భరోసా కలుగుతుందని స్థిరాస్తి రంగానికి చెందిన వారు చెబుతున్నారు. ఒకవేళ హైడ్రా నుంచి ఎన్వోసీ లేకపోతే, అక్రమ నిర్మాణం అని తేలితే.. ఆయా ఇళ్లకు, భవంతులకు ఇంటి నంబరు, తాగునీటి కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయరు. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల చట్ట సవరణపై మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
గతంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ చట్టాన్ని కూడా ఈ లక్ష్యాలతోనే తీసుకొచ్చారు. రెరాకు ముందు డెవలపర్లు.. నిర్మాణ అనుమతులు రాకముందే అబద్ధపు హామీలతో ముందుగానే విక్రయించేవారు. కొనుగోలు చేసినవారు ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నారు. చివరికి ప్రాజెక్ట్కు అనుమతులు రాకపోవడంతో కస్టమర్లు రోడ్డున పడ్డ పరిస్థితులూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ‘రెరా’ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
రెరా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు భద్రత కలిగింది. పారదర్శకత పెరిగింది. ఇప్పుడు హైడ్రా ఎన్వోసీ నిర్ణయం కూడా ఇదేవిధమైన ఫలితాలను ఇస్తుందని స్థిరాస్తి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై భవన నిర్మాణాలకు రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, ఎన్విరాన్మెంట్ తదితర శాఖల ఎన్ఓసీలతో పాటు హైడ్రా అనుమతి కూడా తప్పనిసరి!
హైడ్రాకు అదనపు సిబ్బంది
హైడ్రాకు అదనంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో పనిచేసే ఈ బృందం.. ఆక్రమణల తొలగింపు చర్యలను మరింత వేగవంతం చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa