ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాంట్రాక్టులన్నీ సీఎం తమ్ముడు, బావమరిదికే'.. కేంద్రానికి కేటీఆర్ లేఖ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 09:57 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతున్న విషయంలో జోక్యం చేసుకుని నిజాలను నిగ్గు తేల్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, టోచన్ సాహూలకు ఆయన లేఖ రాశారు. అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై స్పష్టత ఇవ్వాలని తమ పార్టీతో సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అనేకసార్లు డిమాండ్ చేసినా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా సమాధానంగా రాలేదని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు 1500 కోట్ల టెండర్లు ముఖ్యమంత్రి సొంత బావమరిది కంపెనీకి అర్హతలు లేకున్నా కట్టబెట్టారన్న ఆరోపణలపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలన్నారు.


ఈ టెండర్ల తాలూకు సమాచారాన్ని బయటకు పొక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని ఈ మేరకు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ఈ అంశంలో సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి బావమరిది ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నారని.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన విషయం అయినందున వెంటనే అమృత్ పథకంలో గత తొమ్మిది నెలలుగా జరిగిన ప్రతి టెండర్‌ని సమీక్షించి, నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఈ టెండర్లను రద్దు చేయాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ లేఖలో కోరారు.


ఎలాంటి అనుభవం లేకున్నా.. కేవలం సీఎం బంధువు అన్న ఏకైక అర్హతతో ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం అయా కంపెనీలకు కట్టబెట్టిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అటు టెండర్ల విషయాన్ని కానీ, టెండర్లు దక్కించుకున్న కంపెనీల తాలూకు విషయాన్ని కానీ బయటకి పొక్కకుండా మున్సిపల్ శాఖ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఇతర ఈ టెండరింగ్ వెబ్‌సైట్లలోనూ సమాచారం ఉంచకుండా మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. సీఎం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన మేఘ కంపెనీకి కూడా టెండర్లు అప్పజెప్పినట్లు దాదాపు 40 శాతానికి పైగా అంచనాలు పెంచి మరీ పనులను అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్ల తాలూకు సమాచారాన్ని పూర్తిగా దాచి ఉంచుతున్న నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని టెండర్ల తాలూకు డాక్యుమెంట్లని వెంటనే బహిర్గతం చేయాలన్నారు. ఈ టెండర్లు దక్కించుకున్న కంపెనీల తాలూకు వివరాలను కూడా ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa