ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. కేంద్రం నిధులు విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 07:19 PM

తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల్లో వేగం పెరగనుంది. ఈ మేరకు రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.137 కోట్లు విడుదల చేసింది. కొత్తపల్లి నుంచి వేములవాడ మధ్యలో ట్రాక్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నారు.


కొత్తపల్లి -మనోహరాబాద్ మధ్య సింగిల్ ట్రాక్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు దూరాన్ని తగ్గించడం మరియు సిద్దిపేట,సిరిసిల్ల వంటి జిల్లాలకు రైల్వే కనెక్టివిటీని అందించడం ఈ లైన్ ఉద్దేశ్యం. 2024లో కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు 350 కోట్లు కేటాయించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సులువుగా చేరుకోవడానికి వీలుగా కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ రైల్వే లైన్‌లో మెుత్తం 16 స్టేషన్లు ఉండనున్నాయి. ఇప్పటికే నాచారం నుంచి సిద్ధిపేట వరకు ట్రయల్ రన్ పూర్తయింది.


ఇక హైదరాబాద్‌లో నాలుగో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. నగరానికి నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి స్టేషన్ సిద్ధమైంది. మొత్తం 5 ప్లాట్‌ఫాంలతో పాటు.. ట్రైన్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేషన్‌ భవనంలోనే టిక్కెట్‌ కౌంటర్లు, కార్యాలయం సిద్ధం చేశారు. స్టేషన్‌కు ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఈ స్టేషన్ నుంచి తొలుత 6 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు నడపనుండగా.. ఆ తర్వాత 25 జతల దూరప్రాంత ట్రైన్లను నడిపేందుకు సిద్ధమయ్యారు.


రూ.430 కోట్లకు పైగా వెచ్చించి ఈ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతుండగా.. 24 రైల్వే బోగీలు పట్టే విధంగా ఇప్పటికే 5 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. మరో 4 ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు రానున్నాయి. 6 మీటర్ల వెడల్పుతో మరొకటి కూడా సిద్ధం అవుతోంది. 9 ప్లాట్‌ఫాంలలో మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. కోచ్‌ నిర్వహణ వ్యవస్థతో పాటు.. ఎంఎంటీఎస్‌ ట్రైన్లకు ఎటువంటి ఆటంకం లేకుండా మరో రెండు ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa