సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో మూడు నాలుగు ఉమ్మడి వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారైంది.కొంతమంది వ్యక్తులు ఇంటిముందు మురికి కాలవను పూడ్చి వేయడంతో మురికి నీటి ప్రవాహం స్తంభించిపోయింది. దీనికితోడు వర్షాలు కురుస్తుండడంతో రోడ్ల పై వ్యర్థాల నీరు, చెత్తాచెదారం నివాస గృహాల్లోకి చొచ్చుకు వస్తోంది. దీంతో స్థానిక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నామని వార్డు ప్రజలు గ్రామ స్పెషల్ ఆఫీసర్ సతీష్ కు వినతి పత్రం అందజేశారు. చిన్నపాటి వర్షం వస్తే చాలు వరద నీరు రోడ్లపై ఏరులై పారుతోంది.
కాలువల్లోని చెత్తాచెదారం చిందరవందరవుతోంది. అలాగే నివాస గృహల్లోని మురుగు వచ్చేస్తోంది. దీనికితోడు భరించలేని దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. సమస్య తెలిసినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకునే నాథుడే కరువయ్యాడనీ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకమూడి విశ్వేశ్వరరావు, సుంకరి పుల్లారావు, గోపతి బిక్షమయ్య, మేకల అంజయ్య, దొంగరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa