రేవంత్ రెడ్డి గారూ, నీవేదో లక్కీ డ్రాలో వచ్చినట్లుగా ప్రజలు కూడా అదే విధంగా మూసీ పరివాహక ప్రాంతంలోకి హఠాత్తుగా వచ్చారని భావించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వారు అక్కడే దశాబ్దాలుగా ఉంటున్నారని గుర్తించాలన్నారు.తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలను అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటినా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా, తులం బంగారం, మహిళలకు రూ.2,500 సహా 420 హామీలను ఇప్పటికీ కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందన్నారు.ఇప్పుడు హైడ్రా ఎన్నో నిర్మాణాలను కూల్చివేస్తోందని, కానీ చాలా నిర్మాణాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో దశాబ్దాలుగా ఉంటున్న 25 వేల కుటుంబాలను రోడ్డు మీద పడవేస్తానంటే ఎలా? అని మండిపడ్డారు. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే హక్కు ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. తప్పు చేసింది ఎవరు... ఈ ప్రభుత్వం శిక్ష ఎవరికి వేస్తుంది? అని నిలదీశారు.1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమకు పట్టాలు ఇచ్చారని, అప్పుడే ఇళ్లు కట్టుకున్నామని, వారి హయాంలోనే రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయని బాధితులు చెబుతున్నారని వెల్లడించారు. తాము ముప్పై, నలభై ఏళ్లుగా అక్కడే ఉంటున్నామని వాపోతున్నారన్నారు.ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు... భవనానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు... ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు... దశాబ్దాలుగా కరెంట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు... కరెంట్ బిల్లులు కట్టించుకున్నప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయో చెప్పాలని మండిపడ్డారు. అర్ధాంతరంగా ఇల్లు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు.. కానీ మా కుటుంబానికి తెలుసునని కేటీఆర్ అన్నారు. నిర్వాసితులుగా మారితే... ఆ ఊరితో, ఆ ఇంటితో అల్లుకున్న జ్ఞాపకాలు మరిచిపోలేమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa